అఖిలపక్ష సమావేశంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అంశాన్ని లేవనెత్తిన ఆప్..

ABN , First Publish Date - 2023-01-30T13:47:44+05:30 IST

పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

అఖిలపక్ష సమావేశంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అంశాన్ని లేవనెత్తిన ఆప్..

ఢిల్లీ : పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో సమావేశం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని అఖిపక్ష నేతలను కేంద్రం కోరింది. అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్ వాల్, వి.మురళీధరన్ తదితరులు హాజరయ్యారు. ఇక అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్, వైసీపీ పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కేకే, నామ నాగేశ్వరరావు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. విమానం ఆలస్యమైన కారణంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ ఇంకా చేరుకోలేకపోయారు.

అఖిలపక్ష సమావేశంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ లేవనెత్తింది. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో కుల గణన చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక డేటా ఆధారంగా రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ ఫలాలు అందజేయవచ్చునని వెల్లడించింది. మహిళా సంబంధిత అన్ని అంశాలను ప్రస్తావించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును పాస్ చేయాలని కోరింది. ఈ డిమాండ్‌కి బీజేడీ, బీఆర్ఎస్, టీఎంసీ మద్ధతు తెలిపాయి. రైతు సమస్యలు, బ్లూ ఎకానమీ అంశాలను కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.

కాగా.. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రెండు దఫాలుగా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకూ తొలి దఫా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో దఫా సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు పార్లమెంట్ ముందుకు కేంద్ర ఆర్థిక సర్వే రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. రేపు ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉపన్యాసం జరగనుంది. కాగా.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది.

Updated Date - 2023-01-30T14:03:42+05:30 IST