Mysore Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా, బస్సు ఢీ.. గాల్లో కలిసిన 10 ప్రాణాలు..

ABN , First Publish Date - 2023-05-29T19:34:49+05:30 IST

కర్ణాటకలోని మైసూరు నగర (Mysore Road Accident) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరు సమీపంలోని టి.నారసిపుర (T Narasipura) సమీపంలో..

Mysore Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా, బస్సు ఢీ.. గాల్లో కలిసిన 10 ప్రాణాలు..

బెంగళూరు: కర్ణాటకలోని మైసూరు నగర (Mysore Road Accident) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరు సమీపంలోని టి.నారసిపుర (T Narasipura) సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఇన్నోవా ఢీ కొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇన్నోవా నుజ్జునుజ్జయింది. సోమవారం సాయంత్రం 3 గంటల సమయంలో కొల్లెగల్-టి నారసిపుర రాష్ట్ర రహదారిపై సమీపంలోని కురుబూరు గ్రామంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

ఇన్నోవా కారులోని ప్రయాణికులంతా బళ్లారిలోని సంగనకల్లు ప్రాంతానికి చెందిన యాత్రికులుగా తెలిసింది. గాయపడిన వారిని మైసూరులోని హాస్పిటల్‌కు తరలించారు. చాముండి హిల్స్‌ చూసి రైల్వే స్టేషన్‌కు తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇన్నోవాలో మొత్తం 13 మంది ఉన్నట్లు సమాచారం. ఇన్నోవాలో మైసూరు రైల్వే స్టేషన్‌కు వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘోర ప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక్కో బాధిక కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2 లక్షలు ప్రకటించారు. చనిపోయిన పది మందిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో బిల్యా మంజునాథ్ (35), అతని భార్య పూర్ణిమా (30), కుమారుడు పవన్(10), కార్తీక (08), సందీప్ (24), సుజాత (40), కోటేష్ (45), గాయత్రి (35), శ్రావ్య (03), ఇన్నోవా డ్రైవర్ ఆదిత్య (26) చనిపోవడం గమనార్హం.

Updated Date - 2023-05-29T19:35:11+05:30 IST