Pakistan Crisis : శ్రీలంక బాటలో పాకిస్థాన్!

ABN , First Publish Date - 2023-01-11T18:20:56+05:30 IST

శ్రీలంక ఎదుర్కొన్న పరిస్థితులే పాకిస్థాన్‌లో కూడా ఉన్నాయని గత కొద్ది నెలల నుంచి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Pakistan Crisis : శ్రీలంక బాటలో పాకిస్థాన్!
Pakistani People

న్యూఢిల్లీ : శ్రీలంక ఎదుర్కొన్న పరిస్థితులే పాకిస్థాన్‌లో కూడా ఉన్నాయని గత కొద్ది నెలల నుంచి నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుణభారం, అత్యధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య, అనేక రకాల ఆర్థిక సమస్యలతో పాక్ ఆర్థిక వ్యవస్థ టైమ్ బాంబ్‌ను తలపిస్తోందని హెచ్చరిస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం దిగుమతులపై ఆధారపడటం, పరిమిత విదేశీ మారక ద్రవ్య నిల్వలు, స్వేచ్ఛా వాణిజ్యంపై ఆంక్షలు, విదేశీ రుణాలు వంటివాటిలో ఈ రెండు దేశాలకు సారూప్యత ఉండటమే దీనికి కారణమని చెప్తున్నారు. వీరి ఆందోళన నిజమవుతోందనే ఆవేదన ప్రస్తుతం వ్యక్తమవుతోంది.

శ్రీలంకలో...

పర్యాటక రంగానికి ప్రసిద్ధి చెందిన శ్రీలంక గత ఏడాది తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. స్వాతంత్ర్యం పొందిన తర్వాత శ్రీలంకకు ఇంత తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదురవడం ఇదే మొదటిసారి. ప్రజలు భరించలేనంత స్థాయికి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో అప్పటి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్ళిపోయారు. ఇంత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అవి ఏమిటంటే,

1. విదేశీ రుణ భారం : శ్రీలంక ప్రభుత్వం ప్రజా సేవల కోసం విదేశాల నుంచి పెద్ద మొత్తంలో రుణాలను సేకరించింది. ఆదాయానికి మించి ఖర్చులు చేసింది. దీంతో బడ్జెట్ లోటు పూడ్చలేనంత పెరిగిపోయింది.

2. పర్యాటకం : శ్రీలంక ప్రధానంగా పర్యాటక రంగంపై ఆధారపడింది. 2019లో కొలంబోలో బాంబు పేలుళ్ళ తర్వాత పర్యాటకులు ఇక్కడికి వచ్చేందుకు వెనుకాడుతున్నారు. దీంతో విదేశీ మారక ద్రవ్యం ప్రభుత్వానికి రావడం లేదు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కూడా తోడవడంతో పర్యాటక రంగం కుదేలు అయింది.

3. చైనా పెట్టుబడులు : చైనా పెట్టుబడులు ఏ దేశంలో పెరిగినా, ఆయా దేశాల్లో రాజకీయ, ఆర్థిక అస్థిరత్వం పెరుగుతుందనడంలో సందేహం లేదు. పాకిస్థాన్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది.

4. ఎరువుల దిగుమతులపై నిషేధం : నూటికి నూరు శాతం సహజసిద్ధ సాగు విధానాలను అవలంబించాలనే లక్ష్యంతో 2021 నుంచి ఎరువుల దిగుమతులను పూర్తిగా శ్రీలంక ప్రభుత్వం నిషేధించింది. దీంతో దేశంలో ఆహార ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

5. విదేశీ మారక ద్రవ్యం : పంచదార, పప్పులు, చిరు ధాన్యాలు, పెట్రోలు, డీజిల్ వంటివాటికోసం శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడుతోంది. వీటిని దిగుమతి చేసుకునేందుకు తగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేకపోవడంతో సంక్షోభ తీవ్రత మరింత ఎక్కువైంది. వీటన్నిటితోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా తగ్గిపోయాయి. ఇవన్నీ కలిసి ప్రజా జీవనాన్ని స్తంభింపజేశాయి. భారత దేశం వివిధ రూపాల్లో అందించిన సహాయం శ్రీలంకకు బాగా ఉపయోగపడింది.

పాకిస్థాన్‌ పరిస్థితి కూడా అదే...

పాకిస్థాన్ కూడా శ్రీలంక బాటలోనే వెళ్తోందని చాలా కాలం నుంచి నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తగినట్లుగానే దివాలా దిశగా ఆ దేశం పయనిస్తోంది. జనవరి 7న రెండు విదేశీ వాణిజ్య బ్యాంకులకు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించగలిగినప్పటికీ, రానున్న మూడు నెలల్లో 8 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించవలసి ఉంది. అయితే ఆ దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మునుపెన్నడూ లేనంత అత్యంత కనిష్ట స్థాయికి, అంటే, 4.5 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఈ నిల్వలు కనీసం మూడు నెలలకు సరిపడిన నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవడానికి అయినా సరిపోవు.

శ్రీలంక ప్రభుత్వం మాదిరిగానే పాకిస్థాన్ ప్రభుత్వం కూడా అవసరం లేని చోట ఎక్కువ ఖర్చుపెట్టడం, అవసరమైనవాటికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల దెబ్బతింటోందని నిపుణులు చెప్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇటువంటి తప్పుడు నిర్వహణ విధానాల వల్ల ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితికి దిగజారిందని చెప్తున్నారు. రేటింగ్స్ ఏజెన్సీకి చెందిన ఓ విశ్లేషకుడు మాట్లాడుతూ, వాస్తవ ఆర్థిక పరిస్థితిని అంగీకరించేందుకు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తిరస్కరించడం వల్ల, ఆయన మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని తెలిపారు. ఇషాక్ దార్ గత ఏడాదిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

తడబడుతున్న కొత్త ఆర్థిక మంత్రి

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇటీవల 6 బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీని ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ క్రింద పునరుద్ధరించింది. అయితే పెట్రోలు, డీజిల్‌లపై రాయితీలను తొలగించాలని, కొత్త పన్నులను విధించాలని కోరింది. కానీ ఇషాక్ దార్ అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రజల జీవనోపాధి కూడా అస్తవ్యస్తం అయింది. తయారీ, ఎగుమతుల రంగాలు సైతం సంక్షోభంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇషాక్ దార్ జెనీవాలో ఐఎంఎఫ్ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఆయన బుధవారం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, 2022-23 బడ్జెట్ లక్ష్యాలను నెరవేర్చేందుకు ఐఎంఎఫ్ సూచించిన చర్యలను అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయం, ఎగుమతుల రంగాలకు ఇస్తున్న రాయితీలను సమీక్షిస్తామన్నారు. విద్యుత్తు రంగంలో రుణ భారాన్ని తగ్గించుకుంటామన్నారు. ఈ చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని ఐఎంఎఫ్ అధికారులు వివరించారన్నారు. తాము సంస్కరణలను అమలు చేస్తామని, అయితే వాటి వల్ల సామాన్యులపై భారం పడబోదని చెప్పారు.

సౌదీ అరేబియా చేయూత

పాకిస్థానీ మీడియా మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం, రుణ భారంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లో పెట్టుబడులను పెంచాలని సౌదీ అరేబియా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెట్టుబడులు 10 బిలియన్ డాలర్లకు చేరే విధంగా అధ్యయనం చేయాలని అధికారులను సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశించినట్లు సమాచారం. ఈ విధంగా ఇతర మిత్ర దేశాల నుంచి ఆర్థిక సాయాన్ని పొందినప్పటికీ, ఆ సొమ్మును రుణాల చెల్లింపుల కోసమే మళ్లించవలసిన పరిస్థితి పాకిస్థాన్‌లో ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. సమాజం అవసరాలను రాజకీయ నేతలు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు.

తారస్థాయికి ఆహార ధాన్యాలు, పదార్థాల ధరలు

పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి పెను సవాలు ఏమిటంటే, ఫారిన్ డెట్ సర్వీసింగ్‌లో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతోపాటు అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు పాకిస్థానీ రూపాయి విలువ బాగా పతనమైపోయిందని అంటున్నారు. ప్రధాన నగరాల్లోని కొన్ని దుకాణాల్లో గోధుమ పిండి మచ్చుకైనా కనిపించడం లేదని, నెయ్యి, వంట నూనె, వంట గ్యాస్ వంటి ఇతర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తును ఆదా చేయడం కోసం మార్కెట్లను ప్రతి రోజూ రాత్రి 8.30 గంటలకల్లా మూసేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అనవసరంగా విద్యుత్తు ఉపకరణాలను వాడవద్దని ఆదేశించింది. విద్యుత్తును అధికంగా వినియోగించే బల్బుల తయారీపై కూడా నిషేధం విధించనున్నట్లు తెలిపింది. వీథి దీపాల్లో సగం స్విచాఫ్ చేయనున్నట్లు తెలిపింది.

వలసపోవడానికి మొగ్గు

ఇదిలావుండగా, పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనమిక్స్ గత ఏడాది నిర్వహించిన సర్వేలో 40 శాతం మంది పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోవడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినవారిలో యువత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

ప్రపంచ బ్యాంకు నివేదిక

ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ వృద్ధి రేటు బాగా మందగిస్తుందని అంచనా వేసింది. ఇది కేవలం 2 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. గత ఏడాది సంభవించిన వరదలు, ఫలితంగా ప్రజలు పేదరికంలోకి జారుకోవడం కూడా దీనికి కారణమని తెలిపింది. విధానపరమైన అనిశ్చితి వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలిపింది.

Updated Date - 2023-01-11T18:21:01+05:30 IST