Israel vs Palestine: ఇజ్రాయెల్, హమాస్ పోరులో 500కు చేరిన మృతులు.. వందల సంఖ్యలో క్షతగాత్రులు

ABN , First Publish Date - 2023-10-08T12:51:01+05:30 IST

ఇజ్రాయిల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ చేసిన దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వరకు రెండు వైపుల మృతుల సంఖ్య 500కు చేరింది. వీరిలో ఇజ్రాయిల్ పౌరులు 300 మంది ఉండగా, గాజా పౌరులు 200 వరకు ఉన్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.

Israel vs Palestine: ఇజ్రాయెల్, హమాస్ పోరులో 500కు చేరిన మృతులు.. వందల సంఖ్యలో క్షతగాత్రులు

జెరూసలెం: ఇజ్రాయిల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ చేసిన దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వరకు రెండు వైపుల మృతుల సంఖ్య 500కు చేరింది. వీరిలో ఇజ్రాయిల్ పౌరులు 300 మంది ఉండగా, గాజా పౌరులు 200 వరకు ఉన్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచి ఈ ఘర్షణలు జరుగుతుండగా.. పరస్పర దాడుల్లో ఆయా ప్రాంతాలు తీరని ఆస్తి, ప్రాణ నష్టాన్ని చవి చూస్తున్నాయి. ఇజ్రాయిల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు ఇంకా కొనసాగుతోంది. తాజా నివేదిక ప్రకారం, స్డెరోట్, కిబ్బట్జ్ నిర్ యామ్ వంటి ప్రాంతాల్లో రాకెట్ సైరన్‌లు మోగిస్తున్నారు.


పరిస్థితి అదుపులోకి రాలేదని ఇజ్రాయిల్ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు ఆదివారం ఉదయం వరకు కూడా కొనసాగాయి. దశాబ్దాల కాలంలో పాలస్తీనా మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ఇజ్రాయిల్‌లో 1,600 మందికి పైగా గాయపడ్డారు. ఆ దేశం తాజాగా నిర్వహించిన ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్‌లో 17 వందల మంది గాయపడ్డారు.ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్), హమాస్ మధ్య ఆదివారం ఉదయం కూడా యుద్ధం కొనసాగుతోంది. దక్షిణ ఇజ్రాయిల్‌లోని పలు ప్రాంతాల్లో రాకెట్ సైరన్‌లు మోగుతూనే ఉన్నాయని స్థానిక మీడియా పేర్కొంది. గాజా స్ట్రిప్‌కు సమీపంలో ఉన్న స్డెరోట్, కిబ్బట్జ్ నిర్ యామ్, యాద్ మొర్దెచాయ్, నెతీవ్ హాసరా వంటి ప్రాంతాలన్నీ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ప్రభుత్వం గాజా స్ట్రిప్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఇరు దేశాల పోరు నేపథ్యంలో వివిధ దేశాధినేతలు శాంతి చర్చలు ప్రారంభించాలని సూచిస్తున్నారు.

Updated Date - 2023-10-08T12:52:58+05:30 IST