Share News

Joe Biden: హమాస్ దాడులకు ఇండియా - మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కారణం.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-26T16:27:58+05:30 IST

ఒకవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులు చేయడం వెనుక గల కారణాలేంటన్న విషయంపై ఆయా దేశాలు తమతమ అభిప్రాయాలు వ్యక్తం...

Joe Biden: హమాస్ దాడులకు ఇండియా - మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కారణం.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

ఒకవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులు చేయడం వెనుక గల కారణాలేంటన్న విషయంపై ఆయా దేశాలు తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా తన బద్ధ శత్రువైన అమెరికాపై ఒక నింద మోపింది. మిడిల్ ఈస్ట్‌లో ఆ దేశం చేపడుతున్న విధానాల వైఫల్యమే ఈ యుద్ధానికి కారణమంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొన్ని రోజుల క్రితం కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు లేటెస్ట్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధానికి భారత్ - మిడిల్ ఈస్ట్ - యూరప్ కారిడార్ కారణం అయ్యుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులు చేయడానికి ఇండియా - మిడిల్ ఈస్ట్ - యూరప్ కారిడార్ ఒక కారణం అయ్యుండొచ్చని నేను భావిస్తున్నాను. ఇందుకు సంబంధించి నా దగ్గర ఎలాంటి రుజువులు లేవు. ఇది నా ఊహ మాత్రమే. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ మరింత దగ్గర అవుతుండటం, ఈ ప్రాంత సమైక్యత కోసం పురోగతి సాధిస్తున్న క్రమంలో ఈ దాడి జరిగి ఉండొచ్చు. అయితే.. ఆ కారిడార్ పనిని మాత్రం మేము వదిలిపెట్టం’’ అని బైడెన్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో నిర్వహించిన జాయింట్ మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయినా.. బైడెన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఇదే వారంలోనే.. హమాస్ దాడికి ఈ కారిడార్ కారణమని పేర్కొన్నారు.


కాగా.. ఇండియా - మిడిల్ ఈస్ట్ - యూరప్ కారిడార్‌ను భారతదేశంలో సెప్టెంబర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ కారిడార్ ముంబై నుంచి ప్రారంభమవుతోంది. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)కి ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఈ కారిడార్ పొడవు 6 వేల కిలోమీటర్లు కాగా.. అందులో 3500 కిలోమీటర్ల సముద్ర మార్గం ఉంది. దీని నిర్మాణం తర్వాత భారత్ నుండి ఐరోపాకు వస్తువులను రవాణా చేయడంలో దాదాపు 40% సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం కార్గో షిప్ జర్మనీకి చేరుకోవడానికి 36 రోజులు పడుతుంది. ఈ కారిడార్‌లో వెళ్తే 14 రోజులు ఆదా అవుతుంది. తద్వారా.. ఎగుమతి-దిగుమతులు సులభంగా, చౌకగా ఉంటాయి.

ఈ కారిడార్ ఏర్పాటుకు G20 సమ్మిట్ సందర్భంగా భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ అవగాహనా ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆసియా, పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్, యూరప్‌ల మధ్య మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇది రెండు వేర్వేరు కారిడార్‌లను కలిగి ఉంటుంది. తూర్పు కారిడార్ భారతదేశాన్ని పశ్చిమాసియా/మిడిల్ ఈస్ట్‌కు కలుపుతుంది. ఉత్తర కారిడార్ పశ్చిమాసియా/మిడిల్ ఈస్ట్‌ను యూరప్‌కు కలుపుతుంది. ఈ కారిడార్‌ను ప్రకటించినప్పుడు జో బైడెన్ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్ట్ రెండు ఖండాలలో పెట్టుబడులకు ఇది అవకాశాలను పెంచుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-10-26T16:27:58+05:30 IST