China Vs America : అమెరికాకు చైనా ఘాటు హెచ్చరిక
ABN , First Publish Date - 2023-03-24T17:27:09+05:30 IST
దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవిలోకి అమెరికన్ నేవీ డిస్ట్రాయర్ నౌక వరుసగా రెండో రోజు ప్రవేశించడంతో చైనా తీవ్ర ఆగ్రహం
బీజింగ్ : దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవిలోకి అమెరికన్ నేవీ డిస్ట్రాయర్ నౌక వరుసగా రెండో రోజు ప్రవేశించడంతో చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అమెరికాను చైనా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం హెచ్చరించింది. ప్రపంచంలోని శక్తిమంతమైన నావికా దళాలుగల దేశాల్లో రెండు దేశాల మధ్య వరుసగా రెండో రోజు కూడా వాడి వేడి స్పందన, ప్రతిస్పందన కనిపించాయి.
దక్షిణ చైనా సముద్రంలోని ప్రాదేశిక జలాలపై తనకే సర్వాధికారాలు ఉన్నాయని చైనా చెప్తోంది. నౌకలు అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా సంచరించడానికి అవకాశం ఉండాలని అమెరికా పట్టుబడుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని ఇతర దీవులపై యాజమాన్యం విషయంలో ఫిలిప్పైన్స్, బ్రూనై, మలేసియా, ఇండోనేషియాలతో కూడా చైనాకు వివాదం ఉంది.
చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి టాన్ కెఫేయి విడుదల చేసిన ప్రకటనలో, రెచ్చగొట్టే ప్రవర్తనను తక్షణమే మానుకోవాలని అమెరికాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేనిపక్షంలో అటువంటి ప్రవర్తన వల్ల జరిగే ప్రతి సంఘటనకు తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, సుస్థిరతలను కాపాడటం కోసం, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం కోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అవసరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
యూఎస్ఎస్ మిలియస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ (USS Milius guided-missile destroyer) యుద్ధ నౌక గురువారం వివాదాస్పద షీషా దీవుల్లో ప్రయాణించింది. దీంతో పీఎల్ఏ సదరన్ కమాండ్ స్పందించి, జలాల నుంచి ఆ డిస్ట్రాయర్ను తరిమికొట్టేందుకు నౌకలను, విమానాలను మోహరించింది. షీషా దీవులు చైనా ఆక్రమణలో ఉన్నాయి. ఇవి తమవేనని వియత్నాం, తైవాన్ చెప్తున్నాయి. ఈ యుద్ధ నౌక శుక్రవారం కూడా ఈ జలాల్లో ప్రయాణించింది.
దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవుల్లోకి ప్రవేశించినట్లు చైనా చేస్తున్న వాదనను అమెరికా తోసిపుచ్చింది. అమెరికన్ సెవెన్త్ ఫ్లీట్ విడుదల చేసిన ప్రకటనలో, ఈ యుద్ధ నౌక మిలియస్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చినట్లు తెలిపింది. ఈ సముద్రంలో ఇతర కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి :
CAG Report : ఏపీ ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే..
World TB Summit : క్షయ వ్యాధిపై సదస్సులో మోదీ సంచలన వ్యాఖ్యలు