Skin problems: అలా చేస్తే మేలు కన్నా నష్టమే ఎక్కువా?

ABN , First Publish Date - 2023-04-13T11:40:55+05:30 IST

మన శరీరాన్ని రక్షించే అతి ముఖ్యమైన అంగాల్లో చర్మం ఒకటి. చర్మం మన శరీరపు ఉష్ణోగ్రతలను నియంత్రించటంతో పాటుగా బయట వాతావరణంలో

 Skin problems: అలా చేస్తే మేలు కన్నా నష్టమే ఎక్కువా?
Skin problems

మన శరీరాన్ని రక్షించే అతి ముఖ్యమైన అంగాల్లో చర్మం ఒకటి. చర్మం మన శరీరపు ఉష్ణోగ్రతలను నియంత్రించటంతో పాటుగా బయట వాతావరణంలో నుంచి దాడిచేసే వైర్‌సలు..బ్యాక్టీరియా వంటి శత్రువుల నుంచి కూడా కాపాడుతుంది. అయితే చర్మం వయస్సుతో పాటు ముడతలు పడుతుంది. బయట ఎండలో తిరిగినప్పుడు నల్లబడుతుంది. వాతావరణంలోని కాలుష్యం వల్ల చర్మంపై నల్లటి లేదా తెల్లటి మచ్చలు కూడా వస్తాయి. వీటిని తొలగించుకోవటానికి చాలా మంది రకరకాల మందులు, క్రీమ్‌లు వాడతారు. అయితే వీటిలో ఉండే రకరకాల రసాయనాల వల్ల చర్మానికి మేలు కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుందని సౌందర్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మాన్ని సంరక్షించుకోవటానికి సహజసిద్ధంగా మనకు లభించే అనేక పదార్థాలున్నాయని వారు పేర్కొంటున్నారు. పొడిచర్మం ఉన్నవారికి వచ్చే కొన్ని చర్మ సమస్యలు వాటికి పరిష్కారమార్గాలు చూద్దాం.

చర్మం పొడిబారిపోవటం...

కొందరికి చర్మం పొడిగా ఉంటుంది. గోరుతో గీస్తే తెల్లటి గీతలు ఏర్పడతాయి. ఇలా గీతలు ఏర్పడ్డాయంటే చర్మంలో అస్సలు తేమ లేనట్లు లెక్క. ఇలాంటి వారు కొబ్బరి నూనెను తప్పనిసరిగా రాసుకోవాలి. కొబ్బరినూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌, సహజసిద్ధమైన కొవ్వులు చర్మంపై ఒక పొరను ఏర్పాటు చేస్తాయి. ఈ పొర వల్ల శరీరానికి సహజసిద్ధంగా ఉండే తేమ నిలబడుతుంది. చర్మం బాగా పొడిగా ఉన్న చోట.. లేదా మచ్చలు ఉన్న చోట స్వచ్ఛమైన కొబ్బరినూనెను రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఎగ్జిమా ఉన్నవారు...

ఎగ్జిమా ఉన్నవారికి విపరీతమైన దురద ఉంటుంది. ఇలా దురద ఉన్నవారు ఓట్‌మీల్‌ను కలిపిన నీటితో స్నానం చేస్తే దురద తగ్గిపోతుంది. లేదా దురద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ మిశ్రమాన్ని రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ పద్ధతిలో - ముందుగా ఓట్‌మీల్‌ను గ్రైండర్‌లో వేసి పౌడర్‌ చేయాలి. ఈ పౌడర్‌ ఎంత మెత్తగా ఉంటే ఫలితం అంత బావుంటుంది. ఓట్‌మీలే సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

తేనెతో...

పొడి చర్మం, ఎగ్జిమా, సోరియాసిస్‌ వంటి చర్మ సమస్యలు ఉన్నవారికి తేనె మంచి మందుగా పనిచేస్తుంది. సహజంగా తేనె పట్టు నుంచి తీసిన తేనెను వాడితే- దానిలో ఉండే బ్యాక్టీరియా వల్ల చర్మంలో మార్పులు వస్తాయి. అందువల్ల చర్మంపైన స్వచ్ఛమైన తేనెను ఒక పొరగా పట్టించి.. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగటం వల్ల అనేక ప్రయోజనాలు కనిపిస్తాయి.

Updated Date - 2023-04-13T11:40:55+05:30 IST