Students: స్నానం చేసి వారం... ఇదేం దుస్థితి!

ABN , First Publish Date - 2023-03-06T12:30:59+05:30 IST

‘‘అమ్మా.. వారం నుంచి స్నానం చేయలేదమ్మా.. బాత్‌రూంకు (bathroom) వెళ్లాలంటే కిందికి వెళ్లి ట్యాంకర్‌ నుంచి బకెట్లో నీళ్లు నింపుకొని మూడో అంతస్తుపైకి ఎక్కాలంటే చేతకావడం లేదు..

Students: స్నానం చేసి వారం... ఇదేం దుస్థితి!
స్నానం చేసి వారం...

ఒంటికీ, రెంటికీ కూడా తప్పని కష్టాలు.. పంచాయతీ ట్యాంకర్‌ వస్తేనే నీరు

సంవత్సరకాలంగా విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వకుండా వేధిస్తున్న సిబ్బంది

జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి గురుకుల విద్యార్థినుల దీనగాథ

గద్వాల/ అలంపూర్‌ చౌరస్తా, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘అమ్మా.. వారం నుంచి స్నానం చేయలేదమ్మా.. బాత్‌రూంకు (bathroom) వెళ్లాలంటే కిందికి వెళ్లి ట్యాంకర్‌ నుంచి బకెట్లో నీళ్లు నింపుకొని మూడో అంతస్తుపైకి ఎక్కాలంటే చేతకావడం లేదు.. అందుకే చీకటి పడ్డాక పంటపొలాల్లోకి వెళ్తున్నాం.. భయంగా ఉంటుంది.. ఇక్కడ ఉండలేనమ్మా’’ ఇవి జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో (Gurukula school) చదివే ఓ బాలిక తన తల్లితో అన్న మాటలు. ఇలా అక్కడ నివసించే 782 మంది బాలికల్లో ఏ ఒక్కరిని తట్టినా ఇదే దీనగాథ వినిపిస్తుంది. కొన్ని రోజులుగా ఒంటికీ, రెంటికీ.. పంచాయతీ ఏర్పాటు చేసిన ట్యాంకర్‌పై ఆధారపడిన బాలికలు, వారం రోజులుగా స్నానాలు చేయడం లేదు. దీనికి కారణం.. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే. బడి ఆవరణలో ఉండే బోరు మోటర్లకు త్రీఫేస్‌ కరెంటు సరఫరా లేదు. దీంతో విద్యార్థులు నీరు లేక అవస్థ పడుతున్నారు. ఇదే సర్కిల్‌ పరిధిలో సీలింగ్‌ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా యుద్ధప్రాతిపదికన కనెక్షన్లు ఇచ్చే అధికారులు, పేద విద్యార్థులు (Students) చదివే పాఠశాలకు మాత్రం కనెక్షన్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారు.

వాటర్‌ ట్యాంకర్‌ నీరే ఆధారం

పుల్లూరు గ్రామ శివారులో అయిదేళ్ల క్రితం ప్రభుత్వం మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. దీనిని క్రమంగా ఇంటర్‌ (Inter) వరకు అభివృద్ధి చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో ఉండే బాలికల ఇంటర్‌ కళాశాలలో వసతులు సరిగా లేవనే కారణంతో అక్కడి విద్యార్థినులను ఇదే భవన పరిసరాల్లోకి తరలించారు. అందుకోసం ఆదనపు గదులు నిర్మించి నడిపిస్తున్నారు. పాఠశాల విద్యార్థినులు 467 మంది, కళాశాలలో చదివే బాలికలు సుమారు 315 మంది ఉన్నారు. మొత్తం 782 మంది విద్యార్థులు ఉండే ఈ గురుకులంలో వారం రోజులుగా నీరు లేకపోవడంతో పంచాయతీ సర్పంచ్‌ నారాయణమ్మ ప్రత్యేకంగా ట్యాంకర్‌ను పంపిస్తున్నారు. అయితే అవి కూడా బహిర్భూమి అవసరాలకు మాత్రమే సరిపోతుండగా, మరుగుదొడ్లు నీటి వసతి లేక కంపుకొడుతున్నాయని ప్రిన్సిపాల్‌ దేవదానం ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. వచ్చిన ట్యాంకర్‌ నుంచి బకెట్లతో నీటిని తీసుకెళ్లి సర్దుకోవాల్సి వస్తోందని బాలికలు వాపోతున్నారు. అవి కూడా మూడో అంతస్తుకు మోసుకెళ్లడం చేతకాక పొలాలు, ముళ్లపొదల్లోకి బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!

కలెక్టర్‌ ఆదేశించినా నిర్లక్ష్యమే..

పాఠశాలకు త్రీఫేస్‌ కరెంటు కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశారు. కనెక్షన్‌ మంజూరు కాకపోవడంతో కలెక్టర్‌ను ఆశ్రయించగా, ఆమె సదరు పాఠశాలకు కనెక్షన్‌ ఇవ్వాల్సిందిగా విద్యుత్‌ శాఖను ఆదేశించారు. విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చే వరకు విద్యార్థుల అవసరాలు తీరడం కోసం సమీపంలోని వ్యవసాయ కనెక్షన్‌ నుంచి తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకున్నారు గురుకుల అధికారులు. వారం క్రితం వరకు ఆ కనెక్షన్‌పైనే విద్యార్థులు ఆధారపడగా విద్యుత్‌ అధికారులు స్పందించింది లేదు. పైగా తాత్కాలికంగా అవసరం తీర్చుకుంటున్న దాన్ని కూడా అక్రమ కనెక్షన్‌గా గుర్తించి తొలగించారు. రెండు రోజుల్లో త్రీఫేస్‌ కనెక్షన్‌ ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. కనెక్షన్‌ ఇవ్వడం దేవుడెరుగు, ఇప్పటి వరకు ఆ పాఠశాలవైపు కన్నెత్తి చూసిన అధికారి లేకుండా పోయాడు.

కనెక్షన్‌ ఇస్తామన్నారు

పాఠశాలలో నీటి కొరత ఉన్నమాట వాస్తవమే. గతేడాది కలెక్టర్‌ అదేశించినా విద్యుత్‌ అధికారుల తీరు వల్ల త్రీఫేస్‌ కనెక్షన్‌ రావడం ఆలస్యమైంది. పిల్లలకు ఇబ్బంది రాకుండా గ్రామపంచాయతీ నుంచి ట్యాంకర్‌ తెప్పిస్తున్నాం. సోమవారం కనెక్షన్‌ ఇస్తామని అధికారులు చెప్పారు.

- దేవదానం, ప్రిన్సిపాల్‌, పుల్లూరు గురుకుల పాఠశాల

Updated Date - 2023-03-06T12:31:03+05:30 IST