High Court: తెలుగు అభ్యర్థులకు ఊరట.. టీఎస్‌పీఎస్సీకి ఆదేశం

ABN , First Publish Date - 2023-03-21T12:45:04+05:30 IST

జూనియర్‌ లెక్చరర్‌ (Junior Lecturer) (జేఎల్‌) ఉద్యోగ నియామక పరీక్షల్లో భాగంగా సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష అయిన పేపర్‌-2ను

High Court: తెలుగు అభ్యర్థులకు ఊరట.. టీఎస్‌పీఎస్సీకి ఆదేశం
High Court

జేఎల్‌ పేపర్‌-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాల్సిందే!

అది విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించే పేపరే తప్ప

భాషా సామర్థ్యాన్ని పరీక్షించేది కాదు: హైకోర్టు

ఇష్టానుసారంగా పేపర్‌ ఇస్తామంటే కుదరదని టీఎస్‌పీఎస్సీకి స్పష్టీకరణ

ప్రశ్నపత్రాన్ని ఆంగ్లంలోనే ఇవ్వడంపై కొందరి పిటిషన్

ఉత్తర్వుతో తెలుగు మాధ్యమ అభ్యర్థులకు ఊరట

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జూనియర్‌ లెక్చరర్‌ (Junior Lecturer) (జేఎల్‌) ఉద్యోగ నియామక పరీక్షల్లో భాగంగా సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష అయిన పేపర్‌-2ను ఆంగ్లంతోపాటు తెలుగు మాధ్యమంలో కూడా ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ (TSPSC), ఇంటర్మీడియట్‌ విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసింది. కేవలం ఆంగ్లంలో మాత్రమే ఇవ్వడం వల్ల తెలుగు మాధ్యమంలో పీజీ చేసిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని హైకోర్టు పేర్కొంది. ఆంగ్ల మాధ్యమంలో పేపర్‌ ఇవ్వడం వల్ల తెలుగు మాధ్యమ అభ్యర్థులు పోటీపడలేరని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం అని పేర్కొంది. ఈ మేరకు రెండు మాధ్యమాల్లోనూ పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులిచ్చింది. జేఎల్‌ పోస్టుల పరీక్షల్లో ఆయా సబ్జెక్టుల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని వెల్లడించే పేపర్‌-2ను ఆంగ్ల మాధ్యమంలోనే ఇస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు (High Court)లో ఓ పిటిషన్‌ దాఖలైంది. టీఎస్‌పీఎస్సీ చర్య వల్ల తెలుగు మాధ్యమ అభ్యర్థులకు ఇబ్బందులెదురవుతున్నాయంటూ ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలానికి చెందిన కొందరు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కే శరత్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది బూర రమేశ్‌ వాదనలు వినిపించారు. 77 జేఎల్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గత ఏడాది డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీచేసిందని తెలిపారు. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ (పేపర్‌-1)ను తెలుగు, ఆంగ్ల భాషల్లో ఇస్తున్నారని.. సబ్జెక్ట్‌ (పేపర్‌-2)ను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఇస్తున్నారని తెలిపారు. ఇంటర్‌ స్థాయిలో కోర్సులన్నీ కూడా తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారని.. అలాంటప్పుడు జేఎల్‌ పేపర్‌-2ను ఆంగ్ల మాధ్యమంలో ఇవ్వడం వల్ల తెలుగు మాధ్యమంలో పీజీ చేసిన అభ్యర్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

చివరిసారి 2008లో రిక్రూట్‌మెంట్‌ జరిగినప్పుడు రెండు మాధ్యమాల్లో పేపర్‌ ఇచ్చారని గుర్తుచేశారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్రంలో పీజీ కోర్సులను కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహిస్తున్నారని.. తెలుగు మాధ్యమం లేదని ఆయన తెలిపారు. అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకే ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 16 సబ్జెక్టుల్లో పరీక్షలు జరుగుతున్నాయని.. అన్నింటినీ తెలుగులోకి అనువదించడం కష్టంతో కూడుకున్న పని అని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. అభ్యర్థుల్లో దూరవిద్య ద్వారా తెలుగు మాధ్యమంలో పీజీ చేసిన వారు కూడా ఉన్నారని గుర్తుచేసింది. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం కారణంగా కొందరు రెగ్యులర్‌గా పీజీ చేయలేరని, అలాంటి వారు దూరవిద్య ద్వారా చదువుకుంటార ని పేర్కొంది. కేవలం ఆంగ్ల మాధ్యమంలో పేపర్‌ ఇవ్వడం ద్వారా వారి అవకాశాలను దెబ్బతీసినట్లవుతుందని, ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులతో పోటీపడలేరని వ్యాఖ్యానించింది. పేపర్‌ -2 అనేది కేవలం సబ్జెక్టులో విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించే పేపర్‌ అని.. భాషా సామర్థ్యాన్ని పరీక్షించే పేపర్‌ కాదని తెలిపింది. తెలుగు మాధ్యమ అభ్యర్థులు ఆంగ్లాన్ని అర్థం చేసుకోలేకపోతే భారీగా నష్టపోతారని పేర్కొన్నది. టీఎ్‌సపీఎస్సీ తన ఇష్టానుసారం పేపర్లు ఇస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది.

Updated Date - 2023-03-21T12:45:04+05:30 IST