Share News

Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ హెచ్చరిక!

ABN , First Publish Date - 2023-10-31T12:58:51+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు బెదిరింపులు రావడం గమనార్హం. తాజాగా దుండగుడు రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.

Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ హెచ్చరిక!

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు బెదిరింపులు రావడం గమనార్హం. తాజాగా దుండగుడు రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. దండగుడు మెయిల్ ద్వారా అంబానీని బెదిరిస్తున్నాడు. రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంబానీకి మెయిల్ వచ్చింది. ఇది నాలుగు రోజుల వ్యవధిలోనే అంబానీకి వచ్చిన మూడో బెదిరింపు మెయిల్ అని ఓ అధికారి తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి మొదటగా శుక్రవారం నాడు అంబానీకి మెయిల్ వచ్చింది. అందులో రూ.20 కోట్లు ఇవ్వాలని అంబానీని డిమాండ్ చేశాడు. దీంతో అంబానీ సెక్యూరిటీ ఇన్‌చార్జ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత శనివారం రూ.200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరో మెయిల్ వచ్చింది. ఇక సోమవారం ముచ్చటగా మూడో మెయిల్ వచ్చింది. అందులో నిందితుడు తన డిమాండ్ డబ్బులను రెట్టింపు చేశాడు. ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే తన వద్ద ఉన్న షూటర్లతో చంపేస్తానని అంబానీని హెచ్చరించాడు.


కాగా నిందితుడు షాదాబ్ ఖాన్ వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. ఎందుకంటే వచ్చిన మూడు మెయిల్స్ కూడా షాదాబ్ ఖాన్ అనే మెయిల్ నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. అతను జర్మనీలోని బెల్జియం నుంచి ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం. కాకపోతే మెయిల్ ఐడీలో ఉన్న షాదాబ్ ఖాన్ అనే వ్యక్తే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాడా? లేదంటే మరేవరైనా అతని ఖాతా ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది. పూర్తి విషయాలను తెలుసుకుని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, సైబర్ బృందాలు వేట సాగిస్తున్నాయి. కాగా అంబానీ కుటుంబానికి బెదిరింపులు రావడం కొత్తేం కాదు. గతేడాది బీహార్‌లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి అంబానీ, అతని కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అలాగే ముంబైలోని సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిని పేల్చివేస్తామని హెచ్చరించాడు. అయితే నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Updated Date - 2023-10-31T12:58:51+05:30 IST