Wealth: ఇన్వెస్టర్లకు రూ.7 లక్షల కోట్ల నష్టం.. ఇంత డబ్బు పోవడానికి కారణాలివే..

ABN , First Publish Date - 2023-02-22T17:26:16+05:30 IST

దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Equity markets) బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విడుదలైన డేటాను బట్టి చూస్తే..

Wealth: ఇన్వెస్టర్లకు రూ.7 లక్షల కోట్ల నష్టం.. ఇంత డబ్బు పోవడానికి కారణాలివే..

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Equity markets) బుధవారం భారీ నష్టాల్లో (Stock market crash) ముగిశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విడుదలైన డేటాను బట్టి చూస్తే.. ద్రవ్యోల్బణం కట్టడికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్ల పెంపు (Interest rates) కొనసాగించడం ఖాయమనే విశ్లేషణలు ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేశాయి. వడ్డీ రేట్లు పెరుగుదల, అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు, మరోపక్క ఆర్బీఐ భేటీ మినిట్స్ విడుదల ప్రభావంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) సూచీ 272 పాయింట్లు మేర నష్టపోయి 17,554 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) దాదాపు 930 పాయింట్లు మేర పతనమయ్యి 59,744 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో దేశీయ మార్కెట్లు వరుసగా నాలుగవ రోజు నష్టపోయినట్టయ్యింది. ఫలితంగా కేవలం 4 రోజుల్లోనే రూ.7 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది.

నష్టాలకు ప్రధాన కారణాలివే..

1. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు

వాల్‌స్ట్రీట్ మార్కెట్ ఈ ఏడాది 2023లో అత్యధిక నష్టాలను మంగళవారం నమోదు చేసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 2 శాతం మేర పతనమైంది. డౌజోన్స్, నాస్‌డాక్ సూచీలది కూడా ఇదే పరిస్థితి.

2. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు

అత్యంత కీలకమైన అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం అంతర్జాతీయంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడ ఆకస్మికంగా పర్యటించడం కూడా ఈ పరిస్థితులకు కారణమైన విషయం తెలిసిందే.

ఇక ఆర్బీఐ మినిట్స్ విడుదల కానుండడం, అదానీ స్టాక్స్ నష్టాలు కొనసాగడం, టెక్నికల్ అంశాలు, ఎఫ్ఐఐల భయాలు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి.

Updated Date - 2023-02-22T19:42:16+05:30 IST