Visakha: కిడ్నీ రాకేట్ కేసు.. పోలీసులు అదుపులో ఆస్పత్రి ఎండి..

ABN , First Publish Date - 2023-04-29T11:43:43+05:30 IST

విశాఖ: కిడ్నీ రాకేట్ కేసు (Kidney Racket Case)లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శ్రీ తిరుమల ఆసుపత్రి ఎండి పరమేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Visakha: కిడ్నీ రాకేట్ కేసు.. పోలీసులు అదుపులో ఆస్పత్రి ఎండి..

విశాఖ: కిడ్నీ రాకేట్ కేసు (Kidney Racket Case)లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శ్రీ తిరుమల ఆసుపత్రి ఎండి పరమేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న డాక్టర్ స్రవంత్ కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ఇప్పటికే కామరాజు పోలీసులకు లొంగిపోగా.. ఎలినా పరారీలో ఉన్నారు. బాధితుడు వినయ్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

కాగా కిడ్నీ మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టామని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ పరిధిలోని పెందుర్తి శ్రీ తిరుమల ఆస్పత్రిలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విశాఖ కలెక్టర్‌, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆస్పత్రిని సీజ్‌ చేశారని తెలిపారు. అసలు తిరుమల ఆస్పత్రికి అనుమతులే లేవని తేలడంతో, యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. తిరుమల ఆస్పత్రి వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రస్థాయిలో ఒక కమిటీని వేసినట్లు మంత్రి తెలిపారు.

విశాఖలో కిడ్నీల వ్యాపారం గుట్టుగా సాగిపోతోంది. ఆర్థిక అవసరాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని పలు ఆస్పత్రులు కిడ్నీల దందా సాగిస్తున్నాయి. నగర పరిధిలోని పలు ఆస్పత్రులు.. ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులకు అనధికారికంగా కిడ్నీ ఏర్పాటు చేస్తున్నాయి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు లక్షలాది రూపాయలు ఇచ్చేందుకు ముందుకొస్తుండగా, ఆయా ఆస్పత్రులు నిరుపేదలకు కొంత మొత్తాన్ని చెల్లించి వారి నుంచి కిడ్నీలు తీసుకుని అవసరమైన వారికి అమరుస్తున్నాయి. అయితే, ఆర్థిక లావాదేవీలు బెడిసికొడుతుండడంతో ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నగర పరిధిలోని శ్రద్ధ ఆస్పత్రిపై ఆరోపణలు రాగా, తాజాగా పెందుర్తిలోని శ్రీతిరుమల ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్‌ బయటపడింది. కిడ్నీ ఇచ్చిన వ్యక్తికి ముందస్తు ఒప్పందం ప్రకారం ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2023-04-29T11:43:43+05:30 IST