Venkaiah Naidu: కళలకు పునరుజ్జీవం కల్పించడానికి విద్యా పాఠ్యాంశాల్లో తిరిగి చేర్చాలి

ABN , First Publish Date - 2023-09-02T21:28:56+05:30 IST

భారతదేశం(India) సంగీత, కళలకు అనాదిగా విశ్వగురు స్థానంలో నిలిచిందని, దాన్ని తిరిగి పునరుజ్జీవం చేయడానికి విద్య విధానంలో సంగీత, కళలను ప్రవేశపెట్టాలి అని, భారత మాజీ ఉప రాష్ట్రపతి డా ఎం. వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) పిలుపు నిచ్చారు.

Venkaiah Naidu:  కళలకు పునరుజ్జీవం కల్పించడానికి విద్యా పాఠ్యాంశాల్లో తిరిగి చేర్చాలి

విశాఖపట్నం: భారతదేశం(India) సంగీత, కళలకు అనాదిగా విశ్వగురు స్థానంలో నిలిచిందని, దాన్ని తిరిగి పునరుజ్జీవం చేయడానికి విద్య విధానంలో సంగీత, కళలను ప్రవేశపెట్టాలి అని, భారత మాజీ ఉప రాష్ట్రపతి డా ఎం. వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) పిలుపు నిచ్చారు. శనివారం విశాఖలోని విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, కళాభారతి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వీఎండీఏ కళాభారతి జాతీయ సంగీత నాటకోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కళలకు వయసుకు సంబంధం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలోనే మాట్లాడాలని, మాతృభాష మాత్రమే జీవితాన్ని అందిస్తుందన్నారు. ఇంతమంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కళా భారతి , వీఎండీఏ కమిటీ అభినందనీయులు అన్నారు. తనకు తెలుగు భాషలోనే మాట్లాడడం ఇష్టమని, అందుకే ఆహుతుల్లో కూడా తెలుగు మాట్లాడే వారే అధికంగా ఉంటారన్నారు. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడం ఆనందంగా ఉంటుందన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన వైస్ అడ్మిరల్ జి. శ్రీనివాసన్, సంస్థ అధ్యక్షులు ఎం ఎస్ ఎన్ రాజు, కార్యదర్శి. జి అర్కే ప్రసాద్, తదితరులు ప్రముఖ వాయిలీన్ విద్వాంసులు, పద్మశ్రీ, డాక్టర్ అన్నవరపు రామస్వామికు నాద విద్యా భారతి పురస్కారం అందించారు.వీరికి పురస్కారం తో లక్ష రూపాయలు నగదు, స్వర్ణ కమలం సమర్పణ చేశారు. అపర త్యాగరాజుగా కొనియాడబడుతున్న రామస్వామి, నాటి తరం నుంచి నేటితరం వరకూ జ్ఞాన రీత్యా, వయసు రీత్యా అత్యున్నత పెద్దలు. కొన్ని వందలమంది శిష్య ప్రశిష్యులను అందించిన అన్నవరపు రామస్వామి సంగీత సరస్వతి మంగళంపల్లి బాలమురళి కృష్ణ సహాధ్యాయులు అని వక్తలు పేర్కొన్నారు.

అవార్డు గ్రహీత పద్మశ్రీ అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ.. కర్ణాటక సంగీతానికి అంత ఆదరణ లభించడానికి తెలుగు భాష మాత్రమేనన్నారు. ఇతర భాషల్లో తక్కువ అక్షరాలు ఉన్నాయనీ, తెలుగు భాషలో మాత్రమే 50కి పైగా అక్షరాలు ఉన్నాయన్నారు. ఎన్నో రాగాలు, కీర్తనలు లభించాయని తెలిపారు. ఈరోజు జరిగిన సన్మానం సంగీత సరస్వతికి, తన గురువులకు జరిగిందన్నారు.37వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు.సభ అనంతరం అవార్డు గ్రహీత రామస్వామి సంగీత కచేరీ నిర్వహించాల్సి ఉండగా.. తమ శిష్యులు మోదుకూరి సుధాకర్ గాత్రా కచేరీకి, ఫాల్గుణ వాయిలీన్ పైన, ఘటంపై హరిబాబు, సహకారంతో సంగీత కచేరీ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని, రామస్వామి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.

Updated Date - 2023-09-02T21:28:56+05:30 IST