Share News

Yuvagalam: నారా లోకేష్ 221వరోజు యువగళం పాదయాత్ర

ABN , First Publish Date - 2023-12-13T08:39:31+05:30 IST

అనకాపల్లి: తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు.

Yuvagalam: నారా లోకేష్ 221వరోజు యువగళం పాదయాత్ర

అనకాపల్లి: తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు. 221వరోజు బుధవారం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభంకానుంది.

ఉదయం 8.00 గంటలకు నక్కపల్లి కృష్ణగోకులం లేఅవుట్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

– 8.10కు సరిపల్లిపాలెంలో మత్స్యకారులతో సమావేశం.

– 8.25 గంటలకు కోనవానిపాలెంలో కొబ్బరిపీచు కార్మికులతో భేటీ..

– 9.10కు తిమ్మాపురం అడ్డరోడ్డులో స్థానికులతో సమావేశం.

– 10.25 గంటలకు గోకులపాడులో సుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో భేటీ..

– 11.25కు పెనుగొల్లు గ్రామంలో భోజన విరామం.

– 2.00 గంటలకు పెనుగొల్లులో సుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం.

సాయంత్రం

– 4.00 గంటలకు పెనుగొల్లు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

– 4.30కు పెనుగొల్లులో రైతులతో సమావేశం.

– 5.00 గంటలకు పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలోకి ప్రవేశం.

– 5.45కు పాలపర్తిలో స్థానికులతో సమావేశం.

– 6.00 గంటలకు లక్కవరంలో ములకలపల్లిలో రైతులతో భేటి.

– 6.20కు ములకలపల్లిలో యువతతో ముఖాముఖి.

– 6.50 గంటలకు పురుషోత్తమపురంలో రైతులతో సమావేశం.

– 7.20కు పోతిరెడ్డిపాలెంలో స్థానికులతో భేటీ..

– 8.05 గంటలకు రేగుపాలెం జంక్షన్‌లో స్థానికులతో సమావేశం.

– 9.20కు కొత్తూరు ఎస్‌వి కన్వెన్షన్ సెంటర్ వద్ద విడిది కేంద్రంలో రాత్రికి లోకేష్ బస.

నిన్న (మంగళవారం) లోకేష్ పాదయాత్ర వివరాలు..

జగన్‌ చేతకాని పాలనతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర 220వ రోజు మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నామవరం నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా లోకేశ్‌కు అధిక సంఖ్యలో రైతులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ, పంటల బీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి, కేవలం కొంతమందికి మాత్రమే బీమా చెల్లించి మిగిలిన రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పంటల బీమా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటామని, వ్యవసాయన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. బీసీల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన రూ.75,760కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లించిన ద్రోహి జగన్‌ అని ధ్వజమెత్తారు. ఆదరణ పథకాన్ని రద్దుచేసి కులవృత్తుల వారి ప్రయోజనాలను దెబ్బతిశారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళ కష్టం తీర్చేందుకు మహాశక్తి పథకాన్ని అమలు చేస్తామని, ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.2,500 సాయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సబ్సిడీపై రుణాలు అందిస్తామని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. ఎటువంటి కొర్రీలు లేకుండా పెళ్ల్లి కానుక, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తామని లోకేశ్‌ స్పష్టం చేశారు. వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేసి ఇంటింటికీ 24గంటలు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడంపై లేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

3 నెలల్లో చీకటి పాలనకు తెర.. మళ్లీ చంద్రన్న ప్రభుత్వం వస్తుంది: లోకేశ్‌

నక్కపల్లి: వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో పడిందని, మరో మూడు నెలలు ఓపిక పడితే మళ్లీ చంద్రన్న ప్రభుత్వం వస్తుందని, ఈ చీకటి పాలనకు తెరపడుతుందని లోకేశ్‌ అన్నారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. కళాశాల విద్యార్థినులు, గృహిణులు తమ సమస్యలను యువనేత ముందుంచారు. ఈ కష్టాలు భవిష్యత్తులో లేకుండా, రాకుండా చూస్తామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతో చంద్రన్న బీమా అమలుచేశామని, వైసీపీ ప్రభుత్వంలో ఆ బీమా ఏదని ప్రశ్నించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.5లక్షలతో చంద్రన్న బీమా పథకాన్ని పునఃప్రారంభించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి దానిని రూ.10లక్షల వరకూ పెంచుతామని చెప్పారు. టీడీపీ పాలనలో నిత్యావసర సరకుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, పామాయిల్‌ ధరలు ఎలా ఉండేవి?, కరెంటు చార్జీలు ఏ మాత్రం ఉండేవో గుర్తించాలని కోరారు. విద్యుత్‌ చార్జీలు ఐదేళ్లలో తొమ్మిదిసార్లు, ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచారని... ఇంత చెత్త ప్రభుత్వం ఎక్కడా ఉండదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 20లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 100 రోజుల్లోనే టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు.

Updated Date - 2023-12-13T08:39:34+05:30 IST