AP TDP: సీఎం జగన్ జాదూ అంటూ పోస్టర్ విడుదల..
ABN , First Publish Date - 2023-04-08T15:35:00+05:30 IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) జాదూ అంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత , మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, తెలుగు మహిళలు పోస్టర్ విడుదల చేశారు.
విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) జాదూ అంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha), మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ (Palla Srinivas), తెలుగు మహిళలు పోస్టర్ (Poster) విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఈ మధ్య వీధుల్లో సంచులు వేసుకొని వైసీపీ (YCP) భజన బృందo తిరుగుతోందని, సంచుల్లో ఉన్న స్టిక్కర్ తీసి ప్రతి ఇంటికి వాళ్లే అంటించుకుంటున్నారని విమర్శించారు. జగన్ భవిష్యత్తు అని ప్రజలు చెప్పుకోవాలి కానీ స్టిక్కర్లు అంటించుకోవడమేంటని ప్రశ్నించారు.
సీఎం జగన్ స్టిక్కర్ పథకానికి నాంది పలికారని, ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనే స్టిక్కర్లు వేసే రోజు దగ్గరలోనే ఉందని అనిత అన్నారు. జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు అంటే నాలుక కోస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకపోతే ఆయనకు ఏమీ లేదని.. ఏ తల్లి ఇలాంటి బిడ్డను కనకూడదని చూపించడానికి బెస్ట్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సొంత తల్లినే గౌరవించని వ్యక్తని దుయ్యబట్టారు.
సీఎం జగన్ ఎన్నిసార్లు మాట తప్పారో.. మడం తిప్పారో.. ఆయనే చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. నాలుగు గోడల మధ్య వేరొకరు ఓటు వేస్తేనే తెలిసిపోయింది.. మరి బాబాయి వైఎస్ వివేకను చంపింది ఎవరో ఇప్పటికీ జగన్ తెలుసుకోలేకపోయారా? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని చెప్పినా.. చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయమని వంగలపూడి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘జగనన్న, మా భవిష్యత్తు కాదు.. జగనే మా దరిద్రం’ అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. సంక్షేమంపై డబ్బులు పంచడం జరిగిందని.. అభివృద్ధి లేదని విమర్శించారు. అభివృద్ధి లేక ఉపాధి లేక యువత గంజాయికి బానిసలు అవుతున్నారని పల్లా శ్రీనివాస్ అన్నారు.