Chandrababu: చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-04-12T21:42:07+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బుధవారం చేపట్టిన మచిలీపట్నం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయవాడ (Vijayawada) నుంచి రోడ్డు..

Chandrababu: చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత

మచిలీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బుధవారం చేపట్టిన మచిలీపట్నం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయవాడ (Vijayawada) నుంచి రోడ్డు మార్గాన మచిలీపట్నం (Machilipatnam) బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవున అభిమానులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. పెడన నియోజకవర్గం గూడూరు సెంటర్‌లో అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గజమాలను సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో గూడూరు సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మంత్రి జోగి రమేష్‌ (Minister Jogi Ramesh) అక్కడికి రావడంతో వైసీపీ (YCP) శ్రేణులు ఆయనకు స్వాగతం పలికేందుకు పోటీగా వైసీపీ రంగులతో మరో గజమాలను సిద్ధం చేశారు. ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున మోహరించడంతో గూడూరు సెంటర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

గజమాలాలు ఎదురెదురు క్రేన్‌లతో ఉండేసరికి పోలీసులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆ సమయానికి చంద్రబాబు కాన్వాయ్ (Chandrababu Convoy) ఈడ్పుగల్లు వద్ద ఉంది. గూడూరు సెంటర్‌లో పెద్ద ఎత్తున మోహరించిన ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలతో కవ్వింపు చర్యలకు దిగారు. మంత్రి జోగి రమేష్‌తో పాటు ఆయన కొడుకు రాజీవ్‌ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారు టీడీపీ నాయకులను చూసి తొడలుకొట్టడం, మీసాలు తిప్పడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. నిలువరించాల్సిన మంత్రి కూడా స్వయంగా రెచ్చిపోయారు. టీడీపీ (TDP) కార్యకర్తలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి నినాదాలు చేశారు. గట్టి కౌంటర్‌ ఇచ్చారు. దీంతో వైసీపీ నాయకులు గజ దండతో వెనక్కి తిరిగే పరిస్ధితి ఏర్పడింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. పోలీసులు రెండు క్రేన్‌లను దూరం చేశారు. దీంతో వాతావరణం సద్దుమణిగింది.

Updated Date - 2023-04-12T21:42:07+05:30 IST