Telangana High Court: అవినాష్‌రెడ్డి విచారణ వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2023-03-10T18:33:49+05:30 IST

కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణను వీడియో రికార్డ్‌ చేస్తున్నామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.

Telangana High Court: అవినాష్‌రెడ్డి విచారణ వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్: కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy) విచారణను వీడియో రికార్డ్‌ చేస్తున్నామని సీబీఐ తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు తెలిపింది. వీడియో రికార్డింగ్‌ ఏ దశలో ఉందో చెప్పాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సీబీఐ అధికారులు స్పందించారు. హార్డ్‌ డిస్క్‌, కేసు ఫైల్‌ ఇప్పుడే ఇచ్చేందుకు సిద్ధమని కోర్టుకు సీబీఐ తెలిపింది. హార్డ్‌ డిస్క్‌, కేసు ఫైల్‌ను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని హైకోర్టు సీబీఐ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

అవినాశ్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు (High Court) ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్‌ను, అవినాష్ రెడ్డి కేసు వివరాలు మొత్తం సమర్పించాలని సీబీఐ (CBI)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ ఎస్పీ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కోర్టుకు వచ్చి అవినాష్ రిట్ ఫిటిషన్‌పై కౌంటర్ ధాఖలు చేశారు. అనంతరం హైకోర్టు సోమవారం వరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్‌రెడ్డికి స్వల్ప ఊరట లభించినట్లైంది.

అవినాష్ రెడ్డి నిందితుడా లేక సాక్షియా అని న్యాయస్థానం ప్రశ్నించగా.. 160 సీఆర్‌పీసీ (CRPC) కింద అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చామని, సాక్షిగా పరిగణించిన ఈ కేసులో అవసరమైతే అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హత్యాస్థలిలో దొరికిన లేఖ తమ వద్దే ఉందని హైకోర్టుకు సీబీఐ చెప్పింది. లేఖపై సీఎఫ్‌ఎస్‌ఎల్‌ అభిప్రాయం తీసుకున్నామని, తీవ్ర ఒత్తిడిలో లేఖ రాసినట్లు సీఎఫ్ఎస్ఎల్ (CFSL) తెలిపిందని సీబీఐ పేర్కొంది. మరోవైపు సునీత ఇంప్లీడ్‌ పిటిషన్‌పై అభ్యంతరం ఉందా అని హైకోర్టు అడిగింది. సోమవారం రోజు విచారణకు రావాలని అవినాశ్ రెడ్డిని కోరతామని రాంసింగ్ కోర్టుకు తెలిపారు. అయితే సోమవారం న్యాయస్థానంలో విచారణ ఉంది కాదా అని గుర్తు చేసింది. దీంతో మంగళవారం విచారణ చేస్తామని సీబీఐ తెలిపింది.

Updated Date - 2023-03-10T18:34:45+05:30 IST