TDP: మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు: అచ్చెన్న

ABN , First Publish Date - 2023-04-29T19:04:50+05:30 IST

మే 27, 28 తేదీల్లో రాజమండ్రి (Rajahmundry)లో మహానాడు నిర్వహిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రకటించారు.

TDP: మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు: అచ్చెన్న

రాజమండ్రి: మే 27, 28 తేదీల్లో రాజమండ్రి (Rajahmundry)లో మహానాడు నిర్వహిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రకటించారు. 27న 15 వేల మందితో ప్రతినిధుల సభ, 28న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి మహానాడుకు 2 చోట్ల వేదికలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహానాడు (Mahanadu) నిర్వాహణ కోసం 15 కమిటీలు నియమించామని, రెండు రోజుల్లో కమిటీలను ప్రకటిస్తామని వెల్లడించారు. మే 28న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు.. 15 లక్షల మంది హాజరవుతారని అచ్చెన్నాయుడు చెప్పారు.

టీడీపీ మహానాడును రాజమండ్రిలో మే నెల 27, 28వ తేదీల్లో నిర్వహించడానికి పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఎన్నికలు ఏడాది కాలంలో రానున్న నేపథ్యంలో ఇక్కడ మహానాడు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) అనూహ్యంగా వరస విజయాలు సాధించి, మంచి జోష్‌ మీద ఉన్న టీడీపీ.. మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు రాజకీయ కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవరంలో సభ అంటే టీడీపీకి శుభమేననే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోట వంటివి. గత ఎన్నికలలో ఎక్కువ చోట్ల ఓడినా కేడర్‌లో ఎక్కడా ఆత్మస్థయిర్యం తగ్గలేదు. మరింత పట్టుదల పెరిగింది.

అంతేకాక జనసేనతో కూడా కలిసి పయనించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం వల్ల కూడా మహానాడుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మహానాడుకు సుమారు 100 ఎకరాల స్థలం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సభాస్థలిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి త్వరలో స్థలాన్ని కూడా ఖరారు చేయనున్నారు. ఇక టీడీపీ అగ్రనేతలు వరుసగా రాజమండ్రి రావడానికి కార్యక్రమాలు ఖరారు చేసుకుంటున్నారు. పార్టీ అధిష్ఠానం ఒక విజయోత్సవంగా నిర్వహించాలని చూస్తోంది.

Updated Date - 2023-04-29T19:04:57+05:30 IST