Anagani Satyaprasad: ఆ సామెత జగన్ రెడ్డి, మేఘా కంపెనీలకే సరిపోతుంది

ABN , First Publish Date - 2023-05-11T16:07:25+05:30 IST

పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ పనులను మేఘా కంపెనీకి కట్టబెట్టడంపై టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anagani Satyaprasad: ఆ సామెత జగన్ రెడ్డి, మేఘా కంపెనీలకే సరిపోతుంది

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ పనులను మేఘా కంపెనీకి కట్టబెట్టడంపై టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ (TDP Leader Anagani Satyaprasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో నాలుగు శాతం పనులు కూడా పూర్తి చేయని మెఘా కంపెనీకే తిరిగి డయాఫ్రం వాల్ పనులు కట్టబెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తికి పోలవరాన్ని జగన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) బలి చేస్తున్నారని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వు టెండరింగ్ జరుగుతోందన్నారు. వడ్డేంచేవాడు మన వాడైనప్పుడు ఏ బంతిలో కూర్చున్నా పర్వాలేదనే సామెత జగన్ రెడ్డి, మేఘా కంపెనీలకే సరిపోతుందని యెద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మెఘా కంపెనీకి ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి చేతగానితనంతో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పనులకు నామమాత్రంగా టెండర్లు పిలిచి టెండర్ నిబంధనలకు ఉల్లంఘించి కోట్ల పనులను మేఘా ఇంజినీరింగ్‌కు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రూ.100 కోట్లు దాటిన ఏ కాంట్రాక్ట్‌కైనా జుడిష్యియల్ ఎంక్వైరీ ఇప్పటి వరకు ఎన్ని చేశారని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో 71 శాతం పనులు చేసిన నవయుగ కాంట్రాక్ట్‌ను కక్షపూరితంగా తప్పించి మేఘా సంస్థకు పనులు అప్పగించి పోలవరాన్ని అటకెక్కించారన్నారు. కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల బకాయిలు పెడుతున్న జగన్ రెడ్డి... మెఘా వంటి సంస్థలకు మాత్రం ఆగమేఘాల మీద బిల్లులు ఎలా చెల్లిస్తుందని అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.

కాగా... వరదలకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌.. గ్యాప్‌-1, గ్యాప్‌-2 వద్ద ఏర్పడిన భారీ గుంతల పూడ్చివేత పనులను మేఘా ఇంజనీరింగ్‌ దక్కించుకుంది. ఈ పనులకు జల వనరుల శాఖ రూ.1,615.75 కోట్లతో బిడ్లను పిలువగా.. మేఘా, రుత్విక్‌ సంస్థలు పోటీపడ్డాయి. మేఘా 3 శాతం అధికంగా 1,665.84 కోట్లకు బిడ్‌ వేసి ఎల్‌-1గా నిలిచింది. రివర్స్‌ టెండర్‌ విధానంలో ఎల్‌-2 కంపెనీ రుత్విక్‌ వేసిన బిడ్‌ను వెల్లడించేందుకు వీలుండదు. బుధవారం రివర్స్‌ టెండర్‌ విధానంలో ఆక్షన్‌ నిర్వహించారు. మేఘా 1.02 శాతం తక్కువకు పనులు చేసేందుకు అంగీకరించింది. అంటే రూ.1,599.21 కోట్లకే అన్నమాట. దీంతో అదనపు పనుల కాంట్రాక్టు దానికే దక్కింది. ఇవిగాక వైబ్రో కంపాక్షన్‌ విధానంలో ఇసుకతో గ్యాప్‌-1, గ్యాప్‌-2 పూడ్చివేతకు మరో రూ.400 కోట్లు ఖర్చవుతాయని అంచనా. దీనిని కూడా మేఘాకే కట్టబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, 2019లో పోలవరం హెడ్‌వర్క్స్‌ పనులను రూ.1,548.13 కోట్లకు మేఘా దక్కించుకుంది. ఇప్పుడు మరమ్మతు పనులను ఏకంగా రూ.1,599.74 కోట్లకు అప్పగించడంపై సీఎం జగన్‌, మంత్రి అంబటి రాంబాబు ఏం చెబుతారని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.

Updated Date - 2023-05-11T16:07:25+05:30 IST