Kakani: దేవుడు ఇంతటి అన్యాయం ఎందుకు చేశాడో... శాంతినగర్ ఘటనపై మంత్రి కాకాణి భావోద్వేగం

ABN , First Publish Date - 2023-02-27T09:41:57+05:30 IST

సరదాగా చెరువులోకి వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతైన ఘటనపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు.

Kakani: దేవుడు ఇంతటి అన్యాయం ఎందుకు చేశాడో... శాంతినగర్ ఘటనపై మంత్రి కాకాణి భావోద్వేగం

నెల్లూరు: సరదాగా చెరువులోకి వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతైన ఘటనపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakana GovardhanReddy) స్పందించారు. విషయం తెలిసిన వెంటనే కేరళ రాష్ట్రం (Kerala State)లో అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి (AP Minister) హుటాహుటిన సొంతూరుకు చేరుకున్నారు. ఆరుగురు గల్లంతైన శాంతినగర్ (Sahntinagar Insident) చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాకాణి (Minister Kakani) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు. తమ గ్రామంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదని తెలిపారు. గల్లంతైన ఆరుగురిలో ఒకరికి వివాహామైందన్నారు. సరదాగా మేత వేసే బోటులో వెళ్లారన్నారు. మంచి భవిష్యత్తు ఉండే యువకులని.. దేవుడు ఇంతటి అన్యాయం ఎందుకు చేశాడో అంటూ ఆవేదన చెందారు. అధికారులు అందర్నీ అప్రమత్తం చేశామని తెలిపారు. గల్లంతైన యువకుల కోసం రాత్రంతా వెదికినా ఫలితం లేకపోయిందన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకువెళ్లామని... ఆయన కూడా ఉదారంగా వ్యవహారిస్తారన్నారు. తనకు అత్యంత దగ్గరగా ఉండే వారు ఇలా దుర్మరణం పాలవడం బాధేస్తోందని మంత్రి కాకాణి గోవర్ధన్ ఆవేదన చెందారు.

కాగా.. నెల్లూరు (Nellore) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంత్రి కాకాణి సొంతూరైన పొదలకూరు మండలం తోడేరు పంచాయతీ శాంతినగర్ చెరువులో ప్రమాదం జరిగింది. తోడేరుకి చెందిన 10 మంది యువకులు సరదాగా చెరువులోకి వెళ్లారు. కాగా వీరు వెళ్లిన తెప్ప చెరువులో ప్రమాదవశాత్తు తిరగబడింది. ఈ ఘటనలో ఆరుగురు గల్లంతవగా...నలుగురు యువకులు క్షేమంగా ఒడ్డుకు తిరిగి వచ్చారు. గల్లంతైన ఆరుగురి ఆచూకీ కోసం రాత్రి నుంచి పోలీసులు, గజ ఈతగాళ్ళు, రిస్క్యూ టీం ముమ్మరంగా గాలిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి కాకాణి విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సొంతూరుకు చేరుకున్నారు. ఎస్పీ విజయరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చెరువులో గల్లంతైన వారిలో పముజుల బాలాజీ (21), పాటి సురేంద్ర(18), మన్నూరు కళ్యాణ్(25), బట్టా రఘు(24), అల్లి శ్రీనాధ్(18), చల్లా ప్రశాంత్(28)గా గుర్తించారు. ఇప్పటి వరకు కళ్యాణ్, ప్రశాంత్ అనే ఇద్దరి యువకుల మృతదేహాలను వెలికితీశారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.

Updated Date - 2023-02-27T09:41:59+05:30 IST