Viveka Case : న్యాయవాదితో కలిసి సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్రెడ్డి
ABN , First Publish Date - 2023-03-14T10:58:18+05:30 IST
నేడు వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనుంది. ఈ క్రమంలోనే ఎస్పీ రాంసింగ్ తన సిబ్బందితో కలిసి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
హైదరాబాద్ : నేడు వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)లో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy)ని సీబీఐ (CBI) విచారించనుంది. ఈ క్రమంలోనే ఎస్పీ రాంసింగ్ (SP Ramsingh) తన సిబ్బందితో కలిసి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాష్ రెడ్డి సైతం సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఆయన తన న్యాయవాదితో పాటు సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ గదిలోకి అవినాష్రెడ్డిని మాత్రమే సీబీఐ అనుమతించింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరుపుతారా.. లేదా? అనేది మరికొద్ది సేపట్లో తెలియనుంది. కాగా.. నేడు కూడా 160 సీఆర్పీసీ కింద విచారణ చేసి స్టేట్మెంట్ను సీబీఐ రికార్డు చేయనున్నట్టు తెలుస్తోంది.
కాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. అయితే అవినాశ్రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తన పిటిషన్పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం ఆదేశాలిచ్చారు. తన తీర్పును రిజర్వు చేశారు. వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయరాదని.. తనను విచారించకుండా అడ్డుకోవాలని.. తన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలని.. విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ అవినాశ్రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున స్పెషల్ పీపీలు నాగేంద్రన్, డాక్టర్ అనిల్ కుమార్ వాదనలు వినిపించారు. అవినాశ్రెడ్డి పాత్రకు సంబంధించిన వివరాలతో భారీ సీల్డ్ కవర్ను కోర్టుకు అందజేశారు.