Lokesh: ‘ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉండేది టీడీపీనే’

ABN , First Publish Date - 2023-05-08T13:52:02+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు పాదయాత్రలో భాగంగా శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి చిన్నమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉండేది టీడీపీనే అని అన్నారు.

Lokesh: ‘ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉండేది టీడీపీనే’

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు పాదయాత్రలో భాగంగా శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి చిన్నమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉండేది టీడీపీనే అని అన్నారు. రోశయ్యకు ప్రతి పుట్టినరోజుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవాన్ని అని.. రాజకీయాలకు అతీతంగా రోశయ్య పని చేశారని కొనియాడారు. రోశయ్య చనిపోయినప్పుడు సీఎం జగన్ వెళ్లలేదన్నారు. రోశయ్య కాంగ్రెస్ అయినా తమకు ఆయనంటే గౌరవం ఉందని తెలిపారు. రోశయ్యకు తగిన గౌరవం కల్పిస్తామని.. మ్యూజియం ఏర్పాటు చేసి, ఆయన సేవల తాలూకా ఆనవాళ్లు మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మధ్య పెద్దవాదనలు జరిగినప్పుడు రోశయ్య సంధాన కర్తగా ఉండేవారని గుర్తుచేశారు. రోశయ్య సీఎం అయ్యాక చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించారన్నారు. రోశయ్య చనిపోవడంతో ఆర్యవైశ్యుల్లో పెద్దదిక్కు లేకుండా పోయిందన్నారు. ఆర్యవైశ్యుల్లో పేదరికం ఉందని చెప్పగానే చంద్రబాబు రూ.30 కోట్లతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం మారాక కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. టీడీపీ వచ్చాక దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేస్తామన్నారు. పేదరికానికి కులం, మతం ఉండదని ఆయన తెలిపారు.

కొన్ని కులాలతో పాటు ఆర్యవైశ్యులకు వైసీపీ పాలనలో ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. ఆ కులాల పట్ల వైసీపీకి ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవాలన్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎవర్ని కదిలించినా బాధితులుగా ఉన్నారన్నారు. పోలీసులు కూడా బయటకు వచ్చి తాము కూడా ఈ ప్రభుత్వంలో బాధితులమే అని వాపోతున్నారన్నారు. పక్కరాష్ట్రాల అభివృద్ధిని చూసి అసూయ పడాల్సి వస్తోందని అన్నారు. సమర్థవంతమైన పాలన లేక రాష్ట్రం వెనకబడుతోందన్నారు. అందరిలో చైతన్యం రావాలని.. ఒక్కరిపై కేసు పెడతారు..వెయ్యి మందిపై పెడతారా.? అని ప్రశ్నించారు. ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నదని.. అమర్ రాజా ఎక్కువ పన్ను చెల్లిస్తుందని.. అలాంటి కంపెనీని తెలంగాణకు తరిమారని మండిపడ్డారు. కర్నూలులో 1000 మెగావాట్లతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశామని.. నాలుగేళ్లుగా సోలార్ ప్లాంట్‌పై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి, షాపుల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు తగ్గించాలన్నారు. ఆర్యవైశ్యులను రాజ్యసభకు పంపింది టీడీపీనే అని చెప్పుకొచ్చారు.

ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు చేసింది టీడీపీనే అని... కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూట్రల్‌గా ఉన్నవాటిల్లోకి రాజకీయాలు తెచ్చారన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనూ ఆంధ్రులు ఉన్నారని.. వారికి మంచి అవకాశాలు కల్పిస్తే సొంత రాష్ట్రానికి వచ్చి పనులు చేసుకుంటారన్నారు. ఆర్థికంగా వెనకబడిన ఓసీలకు కేంద్రం 10 రిజర్వేషన్ అమలు చేసిందని... కానీ ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వారి పార్టీకి చెందిన సుబ్బారావు గుప్తాపై దాడి చేసి గంజాయి కేసు పెట్టారన్నారు. వైశ్యులపై ఈ ప్రభుత్వంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులకు పాల్పడిన వారిని చంద్రబాబు వదిలిపెట్టరని హెచ్చరించారు. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని.. వైశ్యులకి రక్షణ కల్పిస్తామని లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-08T13:52:02+05:30 IST