Yanamala: ఏపీ 7 స్థానాలు ఎందుకు పడిపోయింది?..

ABN , First Publish Date - 2023-08-14T14:17:07+05:30 IST

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డాయిష్ బ్యాంకు సర్వేలో ఏపీ ఆర్ధికస్థితి 8వ స్థానం నుంచి 11వ స్థానంకు దిగజారడానికి కారకులెవరని ప్రశ్నించారు.

Yanamala: ఏపీ 7 స్థానాలు ఎందుకు పడిపోయింది?..

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డాయిష్ బ్యాంకు సర్వే (Deutsche Bank Survey)లో ఏపీ (AP) ఆర్ధికస్థితి 8వ స్థానం నుంచి 11వ స్థానంకు దిగజారడానికి కారకులెవరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కంటే ఏపీ 7 స్థానాలు ఎందుకు పడిపోయింది?.. ఇది జగన్ రెడ్డి (Jaganreddy) అసమర్ధత కాదా? అని నిలదీశారు. ఏపీ ఆర్ధికస్థితి ఏడాదికేడాదికి దిగజారుతోందని చెబుతున్నా సీఎం జగన్ పెడచెవున పెట్టారని విమర్శించారు. రాష్ట్రం క్లాసిక్ డెట్ ట్రాప్‌లోకి వెళుతోందని గత నాలుగేళ్లుగా ఏకరవు పెడుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వాస్తవ ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించకుండా పదే పదే అబద్దాలను వల్లెవేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ కంటే వనరులు తక్కువ ఉన్న తెలంగాణ ఆర్ధికస్థితి ఎంతో మెరుగ్గా.. 4వ స్థానానికి వృద్ధిచెందడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడటం జగన్ రెడ్డి చేతగానితనం కాదా? అని ప్రశ్నించారు.

నిన్నటి వరకు విద్యుత్ వినియోగదారులపై రూ. 57 వేల కోట్ల భారాలు వేసి ఇష్టానుసారంగా దోచుకున్న ముఖ్యమంత్రి నేడు విద్యుత్ ఉద్యోగుల నిధులపై పడ్డారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మద్యం బాండ్లతో రూ.16 వేల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ రెడ్డి నేడు మరో రూ. 11,600 కోట్లు అప్పులు తెచ్చేందుకు బాండ్ల వేలానికి వెళుతున్నారన్నారు. మద్యం బాండ్లలోకి విద్యుత్ ఉద్యోగుల పిఎఫ్, పెన్షన్ నిధులు మళ్లించే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. 2018లో రూ.16 వేల కోట్లు ఉన్న రెవెన్యూ లోటు నేడు రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగిందన్నారు. 2018 నాటికి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ రూ. 2.5 లక్షల కోట్లు ఉంటే అవి 4.42 లక్షల కోట్లకు పెరిగాయని, జగన్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్ర రెవెన్యూ నుంచి దాదాపు రూ.30 వేల కోట్లు వడ్డీల చెల్లింపుకే వెచ్చించాల్సిన పరిస్థితి దాపురించిందని యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2023-08-14T14:17:07+05:30 IST