CBI: విచారణకు రాలేనంటూ సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2023-03-05T20:22:17+05:30 IST

కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) లేఖ రాశారు.

CBI: విచారణకు రాలేనంటూ సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) లేఖ రాశారు. సోమవారం ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున తాను విచారణకు హాజరుకాలేనని అవినాష్‌ రెడ్డి సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. వేంపల్లి, పులివెందులలో కార్యక్రమాల దృష్ట్యా హైదరాబాద్‌కు రాలేనని వెల్లడించారు. అవినాష్‌రెడ్డి లేఖపై సీబీఐ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సోమవారం అవినాష్‌రెడ్డికి మాత్రమే మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అవినాష్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి సోమవారం విచారణకు రావాలని సీబీఐ ఆదేశాలు ఇచ్చింది.

దివంగత నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసు(murder case)లో సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సీబీఐ వైఎస్‌ అవినాష్‌రెడ్డి(YS Avinash Reddy)కి మరోసారి షాకిచ్చింది. ఈనెల 6న విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు(CBI notices) జారీ చేసింది. హైదరాబాద్‌(Hyderabad) సీబీఐ ఆఫీస్‌లో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. పులివెందుల(Pulivendula)లో ఆయన నివాసానికి వెళ్లి సీబీఐ నోటీసులు ఇచ్చింది. రేపు(సోమవారం) కచ్చితంగా విచారణకు రావాలని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే అవినాష్‌రెడ్డిని రెండుసార్లు సీబీఐ విచారించింది. ఇక..వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి..తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి(YS Bhaskar Reddy)కి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికే కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని జనవరి 28న, ఫిబ్రవరి 24న సీబీఐ ప్రశ్నించింది. ఇక ఈ నెల 12న కడప సెంట్రల్‌ జైలులో జరిగే విచారణకు హాజరుకావాల్సిందిగా వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి మూడురోజుల క్రితమే సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే చెప్పిన తేదీ కంటే వారం ముందే వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని విచారణకు రమ్మని పిలవడంతో ఏ పరిణామాలు జరుగుతాయోనన్న ఆశక్తి అందరిలో నెలకొంది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. వివేకా హత్య బయట ప్రపంచానికి తెలియకముందే అవినాశ్‌రెడ్డి అండ్‌ కోకు తెలుసునని సీబీఐ భావిస్తోంది. ఘటనాస్థలంలో ఆనవాళ్లు దొరకకుండా రక్తపు మరకలు తుడచడం, మృతదేహానికి కుట్లు వేసి కట్లు కట్టడం, గుండెపోటుగా ప్రచారం చేయడంలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కీలక పాత్ర వహించారని సీబీఐ భావిస్తోంది. హత్య కేసులో ఏ-2గా ఉన్న సునీల్‌యాదవ్‌ వివేకా హత్యకు ముందు రోజు అంటే.. మార్చి 14వ తేదీ సాయంత్రం అవినాశ్‌ ఇంట్లో 15 నిమిషాల పాటు ఉన్నాడని సీబీఐ గూగుల్‌ టేకౌట్‌ ద్వారా సాక్ష్యాలను సేకరించింది. వివేకా హత్యకు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుట్ర చేసి ఉంటారని సీబీఐ అనుమానిస్తోంది. ఈ మేరకు సునీల్‌యాద్‌కు బెయిల్‌ ఇవ్వరంటూ సీబీఐ వేసిన కౌంటర్‌లోనూ ఈవిషయాలన్నీ వెల్లడించింది. హత్యకేసులో కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు ఇప్పటికే రెండుసార్లు వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని ప్రశ్నించింది. కీలకంగా మారిన రూ.40 కోట్ల సుపారీపై ఆరా తీయనున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా హత్య జరిగిన రోజున అంతకు ముందు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి కాల్‌ డేటా, ఘటనాస్థలిలో ఎవరున్నారు తదితర వాటిపై సీబీఐ దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

పది రోజులుగా కడపలో..

పదిరోజులుగా సీబీఐ బృందం కడపలో మకాం వేసింది. ఇప్పటికే పులివెందులకు చెందిన పలువురికి నోటీసులు జారీ చేసింది. నాలుగురోజులుగా సీబీఐ కొందరు అనుమానితులను సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌస్‌ కేంద్రంగా విచారిస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని కలిసిన ఐదుగురికి నోటీసులు జారీ చేసి విచారించింది. పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ)లో పనిచేస్తున్న సుధాకర్‌ అనే ఉద్యోగిని సీబీఐ నాలుగురోజుల క్రితం విచారించింది. అలాగే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సతీమణి భారతి పీఏగా పనిచేస్తున్న నవీన్‌ను ఇటీవలే రెండోసారి విచారించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కడప కేంద్రంగా సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి పీఏ నవీన్‌లను సీబీఐ విచారించింది. ఇక హైదరాబాదులో రెండుసార్లు వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని విచారించింది. ఆ విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తండ్రీకొడుకులు ఇద్దరినీ ఒకరిని హైదరాబాదులో, మరొకరిని కడపలో సీబీఐ ఒకేరోజు విచారణకు పిలవడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కాగా. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూలు కారణంగా సోమవారం పులివెందులలో పార్టీ కార్యకర్తల సమావేశం ఉందని, అందువలన తాను విచారణకు హాజరుకాలేనని ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సీబీఐకి లేఖ రూపంలో సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎంపీ లేఖపై సీబీఐ స్పందించలేదని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-03-05T21:39:30+05:30 IST