Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై వీడిన ఉత్కంఠ.. తెలంగాణ హైకోర్టు ఫైనల్ తీర్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2023-05-31T11:14:32+05:30 IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు (మే 31, 2023) తీర్పు వెలువరించింది.

Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై వీడిన ఉత్కంఠ.. తెలంగాణ హైకోర్టు ఫైనల్ తీర్పు ఏంటంటే..

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కీలక సూత్రధారిగా సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (YS Avinash Reddy) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు (మే 31, 2023) తీర్పు వెలువరించింది. అవినాశ్‌ తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇటీవల తెలంగాణ హైకోర్టు బుధవారం వరకు అవినాశ్‌ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ముందస్తు బెయిల్ రూపంలో అవినాశ్‌కు భారీ ఊరట లభించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే మరో చీకటి భేటీ జరిపిన సంగతి తెలిసిందే. తన తమ్ముడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ఢిల్లీ పరుగెత్తి ప్రధాని మోదీని, షాను కలవడం ఆయనకు పరిపాటిగా మారింది.

జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు వాడీవేడిగా జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ బయల్దేరడం గమనార్హం. ఈ సమయంలోనే వివేకా హత్య గురించి ప్రపంచానికి తెలియడానికి ముందే జగన్‌కు తెలుసంటూ సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన పేరును సీబీఐ తొలిసారి లిఖితపూర్వకంగా ప్రస్తావించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ అనూహ్య పరిణామం జగన్‌కు రాజకీయంగా గట్టి షాకే ఇచ్చింది.

ఢిల్లీ పెద్దలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తే ఏమని సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. సీబీఐ అధికారులు ప్రతిపక్షాలతో చేతులు కలిపారంటూ కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయడం మినహా.. గత్యంతరం లేని విపత్కర పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ఆధీనంలోని దర్యాప్తు సంస్థపై ఫిర్యాదు చేయడమంటే కేంద్రం పైనా ఫిర్యాదు చేయడమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జగన్ మూడ్రోజులు పర్యటించారు.

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా తనపైనా సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోందని ఆయన ఆక్రోశించినట్లు సమాచారం. నీతీ ఆయోగ్‌ భేటీ, నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన జగన్‌... పనిలో పనిగా ఆదివారం రాత్రి (28-05-2023) 10.10గంటల ప్రాంతంలో అమిత్ షాను కలిశారు.

Updated Date - 2023-05-31T11:18:23+05:30 IST