JC Prabhakarreddy: వంద కోట్లు ఇస్తే రాజీనామా చేస్తా

ABN , First Publish Date - 2023-08-17T10:42:27+05:30 IST

తాడిపత్రి బాగుకోసం వంద కోట్లు మంజూరు చేస్తే తాను చైర్మన్‌గా రాజీనామా చేస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్ విసిరారు.

JC Prabhakarreddy: వంద కోట్లు ఇస్తే రాజీనామా చేస్తా

అనంతపురం: తాడిపత్రి బాగుకోసం వంద కోట్లు మంజూరు చేస్తే తాను చైర్మన్‌గా రాజీనామా చేస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి (Tadipatri Muncipal Chairman JC Prabhakarreddy) సవాల్ విసిరారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రి మున్సిపాలిటీని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోచుకుంటున్నాడంటూ మండిపడ్డారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమాలపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ జేసీ మీడియాకు వివరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కోసం మున్సిపాలిటీ స్థలాన్ని తీసుకుంటున్నారని.. అక్కడ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ ఆడించినట్లు ఎస్పీ ఆడుతున్నారని ఆరోపించారు. తన మీద కక్ష పెట్టుకోవద్దన్నారు. మార్కెట్లో దుకాణాలను ఎమ్మెల్యే మనుషులకు ఇచ్చారన్నారు. టీడీపీ కౌన్సిలర్ రాబర్ట్‌ను వైసీపీలో చేర్చుకుని మున్సిపల్ స్థలాన్ని కట్టబెట్టి బిర్యానీ సెంటర్ పెట్టిస్తున్నారని తెలిపారు. కలెక్టర్, ఎస్పీకి చెప్పినా ఒక్క అధికారి కూడా పట్టించుకోరని అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీనా బందలదొడ్డినా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


రేయ్ ఆఫీసర్లు అంటూ...

జేసీ ఇంకా మాట్లాడుతూ... అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రేయ్ ఆఫీసర్లు తమాషా చేస్తున్నారా... మీరు ఏమైపోతారో. ఇసుక తరలించొద్దు అంటూ గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టు తీర్పులిచ్చిన ఇసుక తరలిస్తారా. లా అండ్ ఆర్డర్ లేదా... ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా రిప్లై ఇవ్వరా. తాడిపత్రి నా ఇల్లు... తాడిపత్రి కోసం ప్రాణమిస్తా రేయ్ ఆర్జేడీ నీకు పోస్టింగ్ ఎందుకు. సెక్షన్స్ ఉన్నాయి.. నిన్ను విడిచిపెట్టేది లేదు. ఎస్పీ గారు నా మాటలు మిమ్మల్ని బాధపెట్టొచ్చు... ఎవరికీ భయపడి ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం లేదు. తాడిపత్రి ఇసుక తరలింపును ఆపాల్సిందే. రేయ్ డీటీసీ మీకు ఉద్యోగాలు ఎందుకు... అమ్మిన వాడిపైన కాకుండా మా పైన కేసులు పెడుతారు. మేము కార్యకర్తల కోసం.. కార్యకర్తల కవచం నారా లోకేష్ కార్యక్రమం చేపడుతున్నాం. పార్లమెంట్ ఇన్‌చార్జ్ పవన్ రెడ్డి ఈ కార్యక్రమం లీడ్ చేస్తారు... చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం ఎవరి కాళ్ళు అయినా పట్టుకుంటాంప. అందరికన్నా నష్టపోయింది మేమే.. ఎమ్మెల్యేలు ఎవరైనా పర్లేదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు’’ అంటూ జేసీ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-08-17T10:45:02+05:30 IST