Munugodu : నేడు చండూరులో కేసీఆర్ సభ
ABN , First Publish Date - 2022-10-30T05:58:06+05:30 IST
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసేందుకు రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో టీఆర్ఎస్ తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో సీఎం ..
లక్ష మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు
హాజరుకానున్న లెఫ్ట్ నేతలు తమ్మినేని, కూనంనేని
నల్లగొండ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసేందుకు రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో టీఆర్ఎస్ తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆదివారం సాయంత్రం 3గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు లక్ష మందిని తరలించడమే లక్ష్యంగా మంత్రి జగదీశ్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభలో టీఆర్ఎస్ శ్రేణులతోపాటు ఆ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్న సీపీఎం, సీపీఐ శ్రేణులు కూడా పాల్గొననున్నాయి. సీపీఎం, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. ఒక ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా రెండుసార్లు బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇంతకుముందు.. ఉప ఎన్నిక నోటిఫికేషన్కు ముందే మునుగోడు కేంద్రంగా టీఆర్ఎస్ నేతలు బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ చండూరులో సుదీర్ఘంగా ప్రసంగిస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీని టార్గెట్గా చేసుకుని మునుగోడు ఓటర్లను కారు గుర్తువైపు మళ్లించే దిశగా తమ నేత ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. హెలికాఫ్టర్లో చండూరుకు వస్తున్న సీఎం.. తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. సభా వేదికపై ఫ్లడ్ లైట్లు అమర్చడంతో సభ కొంత ఆలస్యంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది.