BJP state president Bandi Sanjay : అయ్యా, కొడుకుల నోటిని ఫినాయిల్తో సంప్రోక్షణ చేయాలి
ABN , First Publish Date - 2022-10-30T06:07:41+05:30 IST
సంప్రోక్షణ చేయాల్సింది యాదగిరిగుట్ట గుడిని కాదని.. అయ్యా, కొడుకుల నోటిని ఫినాయిల్తో సంప్రోక్షణ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హామీలను అమలు ..
తప్పు చేశారు కాబట్టే సవాల్ స్వీకరించలేదు.. ఆ ఎమ్మెల్యేలను ఎందుకు దాచారు: సంజయ్
నల్లగొండ/యాదాద్రి/మర్రిగూడ/హైదరాబాద్, అక్టోబరు 29: సంప్రోక్షణ చేయాల్సింది యాదగిరిగుట్ట గుడిని కాదని.. అయ్యా, కొడుకుల నోటిని ఫినాయిల్తో సంప్రోక్షణ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హామీలను అమలు చేయని మోసగాళ్లు తిరిగి తెలంగాణ గడ్డ అపవిత్రమైందని.. వారి మోసాలను ఎండగడుతూ తెలంగాణ మొత్తాన్ని సంప్రోక్షణ చేస్తానని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టే తన సవాల్ను స్వీకరించలేదని అన్నారు. మందు తాగే అయ్య, డ్రగ్స్ తీసుకునే కొడుకుకు లక్ష్మీ నరసింహ స్వామి పేరును ఉచ్ఛరించే అర్హత లేదన్నారు. దేవుడినే నమ్మని నాస్తికుడు సంప్రోక్షణ గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. గురువులు దైవంతో సమానమని, వాళ్లకు చెప్పులు అందిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ‘నువ్ తాగి తండ్రిని కొడతావ్. మీ అయ్య తాగి ఆయన గురువు జయశంకర్ సార్ను కొట్టారు. కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించారు’ అని అన్నారు. తప్పు చేస్తే తడి దుస్తులతో దేవాలయానికి వెళ్లరని, తాను వెళ్లడం ద్వారా బీజేపీ నిజాయితీ ఏంటో ప్రజలకు తెలిసిందన్నారు. మీరు, నలుగురు ఎమ్మెల్యేలు తప్పు చేయకపోతే ప్రగతి భవన్లో ఎందుకు దాచిపెట్టారన్నారు. 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్కు బానిసలయ్యారు కాబట్టే డ్రగ్స్ కేసును కనుమరుగు చేశారని విమర్శించారు.
ధరణితో భూములు కబ్జా: ఈటల
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేకపోవడం వల్లే 18 నెలల ముందే రాజీనామా చేసి ప్రభుత్వంపై కొట్లాడుతున్నానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. మునుగోడు సమస్యలను అసెంబ్లీలో మూడేళ్లుగా ప్రస్తావించినా ముఖ్యమంత్రి మాట వినలేదని, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని, అందుకే రాజీనామా చేశానని చెప్పారు. తాను రాజీనామా చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ దిగొచ్చి పింఛన్లు, రోడ్లు, చర్లగూడెం రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం అందజేశారని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ రూ.50 వేల కోట్ల విలువైన 5,800 ఎకరాలను ధరణిలో వివాదాస్పద భూములుగా పెట్టి సీఎం రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ముదిరాజ్ సంఘం సభ్యులతో శనివారం ఆయన సమావేశమయ్యారు.
చేనేత కార్మికులకు టీఆర్ఎస్ దగా: లక్ష్మణ్
చేనేత కార్మికులను టీఆర్ఎస్ మోసం చేసేందుకు కుట్ర పన్నిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. 5 శాతం జీఎస్టీ విధింపునకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్లో సంతకం చేసి ఇప్పుడు బీజేపీపై నిందలు మోపుతోందని పేర్కొన్నారు. చేనేత కార్మికులపై టీఆర్ఎస్కి చిత్తశుద్ధి ఉంటే తన వాటాగా వచ్చే రెండున్నర శాతం ఆదాయాన్ని వదులుకోవాలని డిమాండ్ చేశారు. ‘యాదగిరిగుట్ట ఆలయాన్ని మీ తాతలు కట్టించారా..? అయ్య కట్టించారా..? యాదగిరిగుట్ట పేరు మారిస్తే మీదైపోతుందా..?’ అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. మంత్రి కేటీఆర్ను నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల చేత కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్లు చెప్పులు మోయిస్తున్నారని ధ్వజమెత్తారు.