Team India: ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎఫెక్ట్.. టీమిండియాలో భారీ మార్పులు

ABN , First Publish Date - 2022-11-11T19:52:18+05:30 IST

టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఘోర పరాజయం భారత జట్టు

Team India: ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎఫెక్ట్.. టీమిండియాలో భారీ మార్పులు

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఘోర పరాజయం భారత జట్టు (Team India)లో భారీ మార్పులకు కారణమైంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే ఇండియా జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) సారథ్యంలోని కోచింగ్ బృందానికి విశ్రాంతి కల్పించి జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌‌ (VVS Laxman)కు కోచ్ బాధ్యతలు అప్పగించనున్నారు. న్యూజిలాండ్‌లో భారత్ మొత్తం 6 వైట్ బాల్ గేమ్స్ ఆడనుంది. ఇందులో మూడు టీ20లు, మూడు వన్డేలు ఉన్నాయి. ఈ నెల 18న వెల్లింగ్టన్‌లో తొలి టీ20 ప్రారంభం అవుతుంది.

సీనియర్ ఆటగాళ్లు అయిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul), స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin)లకు ఈ టూర్ నుంచి విశ్రాంతి కల్పించారు. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని కోచింగ్ బృందం మొత్తానికి బ్రేక్ ఇవ్వనుండడంతో జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, హృషికేష్ కనిత్కర్ (బ్యాటింగ్ కోచ్), సాయిరాజ్ బహుతులే (బౌలింగ్ కోచ్) న్యూజిలాండ్‌ (New Zealand) వెళ్లే భారత జట్టుకు కోచ్‌లుగా వ్యవహరిస్తారు.

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) టీ20 సిరీస్‌కు సారథ్యం వహించనుండగా, శిఖర్ ధవన్ (Shikhar Dhawan) వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తాడు. కాగా, బంగ్లాదేశ్‌ టూర్‌కు మాత్రం రోహిత్ శర్మ, కోహ్లీ, అశ్విన్ తిరిగి జట్టులో చేరుతారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో భారత్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. డిసెంబరు 4 నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది. భారత జట్టుకు లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా పనిచేయనుండడం ఇదే తొలిసారి కాదు, ఈ ఏడాది జింబాబ్వే పర్యటనలో కూడా లక్ష్మణ్ కోచ్‌గా పనిచేశాడు. అలాగే, ఐర్లాండ్ పర్యటనతోపాటు ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలోనూ భారత జట్టుకు లక్ష్మణ్ కోచ్‌గా సేవలందించాడు.

Updated Date - 2022-11-11T19:52:20+05:30 IST