Tawang clash : తవంగ్‌లో భారత్-చైనా దళాల ఘర్షణ... కేంద్రం వైఖరిపై సోనియా గాంధీ ఘాటు వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2022-12-21T13:04:52+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్ (Tawang sector)లో చైనా దళాల దాడిపై పార్లమెంటులో చర్చకు అనుమతించడం లేదని

Tawang clash : తవంగ్‌లో భారత్-చైనా దళాల ఘర్షణ... కేంద్రం వైఖరిపై సోనియా గాంధీ ఘాటు వ్యాఖ్యలు...
Mallikarjun Kharge, Sonia Gandhi, P Chidambaram

న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్ (Tawang sector)లో చైనా దళాల దాడిపై పార్లమెంటులో చర్చకు అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gandhi) బుధవారం ఆరోపించారు. ఆ పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సరిహద్దుల్లో చైనా తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని, ఈ అంశంపై చర్చకు అనుమతించడం లేదని మండిపడ్డారు. ప్రజలు, పార్లమెంటు వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం సాధ్యం కావడం లేదన్నారు. చైనీస్ అతిక్రమణలకు ఫైనాన్షియల్ రిప్లైని ప్రభుత్వం ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు.

పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్లమెంటు భవన సముదాయంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ఖర్గే, పి చిదంబరం కూడా పాల్గొన్నారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 7న ప్రారంభమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్‌లో డిసెంబరు 9న భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది. మన సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించాలని తాము కోరుతున్నప్పటికీ ప్రభుత్వం అంగీకరించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గాల్వన్ వద్ద భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలు తాజా ఘర్షణతో మరింత దయనీయ స్థితికి చేరాయి.

Updated Date - 2022-12-21T13:04:56+05:30 IST