Himachal Pradesh Results : ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ 22 వేల ఓట్లతో...

ABN , First Publish Date - 2022-12-08T12:22:28+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సెరాజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి

Himachal Pradesh Results : ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ 22 వేల ఓట్లతో...
Jairam Thakur

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సెరాజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ (Jairam Thakur) ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 22,000కుపైగా ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం ఇది ఆరోసారి. 2012 నుంచి ఆయన ఇదే నియోజకవర్గం నుంచి గెలుస్తున్నారు.

2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో జైరామ్ ఠాకూర్‌కు 35,519 ఓట్లు లభించాయి, ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి చేత్ రామ్‌కు 24,265 ఓట్లు లభించాయి. సెరాజ్ (Seraj) స్థానంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య హోరాహోరీ పోరు జరుగుతూ ఉంటుంది.

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ మండి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు. మండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే సెరాజ్ శాసన సభ నియోజకవర్గం ఉంది. సెరాజ్ నుంచి పోటీ చేసిన చేత్ రామ్ తరపున ప్రతిభ సింగ్ ప్రచారం చేశారు.

68 శాసన సభ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో నవంబరు 12న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది.

Updated Date - 2022-12-08T14:28:10+05:30 IST