Share News

Lok Sabha Polls: రాహుల్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటారా..!

ABN , Publish Date - May 04 , 2024 | 11:04 AM

ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు ఎప్పటినుంచో సాంప్రదాయక స్థానాలుగా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాహుల్‌కు అమేథీ సురక్షితం కాదని పార్టీ గ్రహించే ఆయనను వయనాడ్‌లో బరిలో దింపి ఉండవచ్చనే చర్చ జరిగింది. మరోవైపు సంప్రాదాయక స్థానంలో ఓడిపోగా రాహుల్ వయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచారు.

Lok Sabha Polls: రాహుల్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటారా..!
Rahul Gandhi

ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు ఎప్పటినుంచో సాంప్రదాయక స్థానాలుగా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాహుల్‌కు అమేథీ సురక్షితం కాదని పార్టీ గ్రహించే ఆయనను వయనాడ్‌లో బరిలో దింపి ఉండవచ్చనే చర్చ జరిగింది. మరోవైపు సంప్రాదాయక స్థానంలో ఓడిపోగా రాహుల్ వయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచారు.


2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి పోటీచేస్తున్నారు. అమేథి నుంచి రాహుల్ పోటీచేస్తారని అంతా భావించారు. కానీ వ్యూహం ప్రకారం రాయ్‌బరేలీ నుంచి పోటీచేయాలని చివరి క్షణంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులకు రాయ్‌బరేలీ అడ్డాగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ విజయం సాధించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో అనుకున్నంత ఈజీ కూడా కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్‌ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది.

Rahul Gandhi: రాయ్‌బరేలీలో రాహుల్ పోటీ.. వాయనాడ్ ప్రజల స్పందన ఇదే


గ్యారంటీ సీట్..

రాయ్‌బరేలీ అంటే కాంగ్రెస్‌కు గెలుపు గ్యారంటీ సీట్‌గా మారింది. దేశంలో మోదీ హవా ఉన్నప్పుడు కూడా 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఎంపీగా గెలిచారు. ఫిరోజ్ గాంధీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, సోనియా గాంధీలు రాయ్‌బరేలీ నుంచి ఎంపీలుగా పనిచేశారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ 1977 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇందిరాగాంధీపై వ్యతిరేకత కారణంగా సోషలిస్టు నాయకుడు రాజనారాయణ విజయం సాధించారు. ఇందిరాగాంధీని 52 వేల ఓట్ల తేడాతో రాజనారాయణ ఓడించారు. అంతకుముందు 1971లో ఇందిరాగాంధీపై రాజనారాయణ పోటీచేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.


2024 ఎన్నికల్లో ఏం జరగనుంది..?

ప్రస్తుతం అందరి నోళ్లలో మెదులుతున్న ప్రశ్న రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి గెలుస్తారా లేదా.. ఈ సీటు గాంధీ కుటుంబానికి వారసత్వంగా వస్తున్న సీటుగా చూడాలి. 2004 నుంచి 2019 వరకు రాహుల్ తల్లి సోనియా రాయ్‌బరేలీ ఎంపీగా వరుసగా గెలుస్తూ వచ్చారు. మోదీ వేవ్‌లో బీజేపీ సోనియా గాంధీని ఓడించలేకపోయింది. దీంతో రాహుల్‌గాంధీకి రాయ్‌బరేలీ సీటు సురక్షితమైన సీటుగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఉంది. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో 5 అసెంబ్లీ స్థానాలు ఉండగా సమాజ్‌వాదీ పార్టీకి 4, బీజేపీకి 1 సీటు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ పొత్తుతో కాంగ్రెస్‌కు కొంత లాభం ఉండి ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. బీజేపీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటలో రాహుల్ గాంధీకి ఎస్పీ మద్దతు ఎంతమేరకు మేలు చేస్తుందో జూన్ 4న తేలిపోనుంది.


రాయ్‌బరేలీతో కాంగ్రెస్‌ సంబంధం..?

స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి రాయ్‌బరేలీతో కాంగ్రెస్‌ పార్టీలోని గాంధీ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి. 1921 జనవరిలో మోతీలాల్ నెహ్రూ తన ప్రతినిధిగా జవహర్‌లాల్ నెహ్రూను ఇక్కడకు పంపారు. 1930 ఏప్రిల్ 8న యూపీలో జరిగిన దండి మార్చ్‌కు రాయ్‌బరేలీని ఎంపిక చేశారు. ఆ సమయంలో పండిట్ మోతీలాల్ నెహ్రూ స్వయంగా రాయ్ బరేలీ వెళ్లారు. ఇలా.. గాంధీ-నెహ్రూ కుటుంబం రాయ్‌బరేలీకి దగ్గరైంది. ఆ తరువాత దానిని తమ నియోజకవర్గంగా మార్చుకున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఎన్నికయ్యారు.


రాహుల్‌పై రాయ్ బరేలీ వారసత్వం

రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాగానే సోనియా గాంధీ అమేథీ సీటును రాహుల్‌కి ఇవ్వడం ద్వారా ఆమె రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు సోనియా గాంధీ గెలుపొందినప్పటికీ.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ భావోద్వేగ లేఖ రాసి ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. సోనియా గాంధీ రాయ్‌బరేలీ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై చాలా కాలంగా అనేక ఊహాగానాలు వినిపించాయి. ప్రియాంక, రాహుల్ గాంధీల్లో ఒకరు పోటీచేస్తారని ప్రచారం జరగ్గా.. చివరకు రాహుల్ గాంధీ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రాయ్‌బరేలీ నుంచి గాంధీ కుటుంబ వారసత్వాన్ని రాహుల్ గాంధీపై పెట్టినట్లైంది. ఇక్కడి నుంచి రాహుల్ గెలుస్తారా లేదా అనేది జూన్4న తేలిపోనుంది.


రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For Latest News and National News click here

Updated Date - May 04 , 2024 | 11:04 AM