Share News

రాహుల్‌ పారిపో..

ABN , Publish Date - May 04 , 2024 | 02:46 AM

కేరళలోని వయనాడ్‌ సీటు ఓడిపోతుండటంవల్లనే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ యూపీలోని రాయ్‌బరేలీకి తరలిపోయారని ప్రధాని మోదీ అన్నారు. ‘పారిపో రాహుల్‌ పారిపో...

రాహుల్‌ పారిపో..

కోల్‌కతా, మే 3 : కేరళలోని వయనాడ్‌ సీటు ఓడిపోతుండటంవల్లనే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ యూపీలోని రాయ్‌బరేలీకి తరలిపోయారని ప్రధాని మోదీ అన్నారు. ‘పారిపో రాహుల్‌ పారిపో...భయపడొద్దు’ అంటూ ఎద్దేవాచేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లల కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌లోని బర్ధమాన్‌- దుర్గాపూర్‌, కృష్ణనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో శుక్రవారం బీజేపీ అభ్యర్థుల తరఫున మోదీ ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆమేఠీలో 2019లో ఓటమి తర్వాత ‘యువరాజు’ వయనాడ్‌కు మారారు. ఈ ఎన్నికల్లో అక్కడ ఓడిపోతారని ఆయనకు తెలుసు. అలాగని ఆమేఠీలో పోటీచేసి గెలిచే ధైర్యం లేదు. అందువల్ల ఆయన రాయ్‌బరేలీకి తరలిపోయారు. కాంగ్రెస్‌ నాయకుల్లోని ఓటమి భయానికిదే నిదర్శనం’’ అని మోదీ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై ఆయన విరుచుకుపడ్డారు. సీఎం మమతబెనర్జీ ఏలుబడిలో హిందువులు బెంగాల్‌లో రెండో తరగతి పౌరులుగా జీవించాల్సి వస్తోందని మోదీ ఆరోపించారు. అవినీతి పాలన, రాజకీయ బుజ్జగింపులతో ప్రజాస్వామ్యాన్ని తృణమూల్‌ సమాధి చేసిందని ఆరోపించారు. కాంగ్రె్‌సను గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్లను లాగేసుకుని ‘జిహాద్‌ ఓటుబ్యాంకు’కు కట్టబెడుతుందని మరోసారి ధ్వజమెత్తారు. ఇండియా కూటమి ‘ఓటు జిహాద్‌’కు మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. కాగా, రాయ్‌బరేలీలో రాహుల్‌ అక్కడి బీజేపీ అభ్యర్థి చేతిలో భారీ తేడాతో ఓడిపోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జోస్యం చెప్పారు.

Updated Date - May 04 , 2024 | 02:46 AM