ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు..
ABN , Publish Date - May 02 , 2026 | 07:04 PM
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆదివారం నాడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆదివారం నాడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.
తీవ్ర వడగాల్పులు..
ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్రమైన ఎండ సహా తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకా ఉందని అధికారులు తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో 10 మండలాలు, మన్యం 12, అల్లూరి 1, పోలవరం 5, తూర్పుగోదావరి 3, ఏలూరు 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలోని 7 మండలాల్లో, ఎన్టీఆర్ 14, గుంటూరు 12, బాపట్ల 9, పల్నాడు 22, మార్కాపురం 3, ప్రకాశం 15, నెల్లూరు 4, తిరుపతి జిల్లాలోని 5 మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తంగా 124 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నేటి ఉష్ణోగ్రతలు..
ఈరోజు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో అత్యధికంగా 45.4°C డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏపీ వ్యాప్తంగా 239 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 45.1°C, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 45°C, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.4°C, పల్నాడు జిల్లా నూజెండ్లలో 44.3°C, చిత్తూరు జిల్లా తవణంపల్లె, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 44.1°C డిగ్రీల చొప్పున నమోదు అయ్యాయి. వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడులో 43.9°C, బాపట్ల జిల్లా కారంచేడులో 43.7°C, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.2°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42.8°C, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 42.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్వచ్ఛ రథాలకు నేచురల్ స్టార్ నాని సహాయం.. స్పందించిన డిప్యూటీ సీఎంవో..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు