రాబోయే మూడు గంటలు పిడుగులతో వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:48 AM
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. రాగల మూడు గంటలు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ప్రఖర్ జైన్ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మచిలీపట్నం, ఏలూరు, నర్సాపూరం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాలకు ఆయన పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు.
భారీగా ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఎవరూ కూడా చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వంటి వాటి వద్ద నిలబడవద్దని హెచ్చరించారు. అలాగే కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లల్లోనూ ఉండొద్దని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పెట్టుబడి సాయాన్ని మొక్కుబడి చేశారు: షర్మిల