సెల్ ఫోన్ టవర్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం.. వికారాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం
ABN , Publish Date - May 23 , 2026 | 01:27 PM
వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..
వికారాబాద్, మే 23: జిల్లాలోని దోమ మండల పరిధి.. దిర్సంపల్లి గ్రామంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. భూమి విషయంలో తనకు జరుగుతున్న అన్యాయంపై నిరసనగా బల్వంత్ రెడ్డి అనే స్థానిక రైతు సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ క్రమంలో టవర్ పైనుంచే ఆయన ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేస్తూ, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం స్థానికంగా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
బాధిత రైతు బల్వంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘చెరువు శిఖంలో ఉన్న నా సొంత పొలంలో కొంతమంది అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి బలవంతంగా ఉపాధిహామీ పనులు చేయిస్తున్నారు. గతంలో చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ఇటుక బట్టీలకు తరలిస్తున్న వ్యవహారంపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేశా. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు గాను గ్రామ సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇద్దరూ కలిసి నాపై దౌర్జన్యానికి దిగుతున్నారు. నా సమస్య ఎలాగైనా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లాలి, అప్పటి వరకు కిందకు దిగను’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. బల్వంత్ రెడ్డి సెల్ టవర్ ఎక్కిన విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీసులు దిర్సంపల్లి గ్రామానికి చేరుకున్నారు. సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని నచ్చజెప్పి కిందకు దింపారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అయ్యో.. వరదలో కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్