Share News

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై ప్రభుత్వం అప్పీల్‌

ABN , Publish Date - Aug 25 , 2026 | 05:41 AM

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు సంబంధించిన వ్యవహారంలో సోమవారం హైకోర్టులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పథకాల అమలు కోసం జారీ చేసిన 8 ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేసింది.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై ప్రభుత్వం అప్పీల్‌

  • సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టేనుఎత్తేయాలని డివిజన్‌ బెంచ్‌కు

  • వెకేట్‌ స్టే పిటిషన్‌ విచారణలోఉండగానే సర్కార్‌ అప్పీల్‌ దాఖలు చేసింది

  • సింగిల్‌ జడ్జి దృష్టికి తీసుకెళ్లిన పిటిషనర్‌

  • దివ్యాంగ వధువులకు ఊరట

  • జీవో నం.4పై స్టే ఎత్తివేత

  • సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టేను కొట్టేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు సంబంధించిన వ్యవహారంలో సోమవారం హైకోర్టులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పథకాల అమలు కోసం జారీ చేసిన 8 ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేసింది. కాగా, వెకేట్‌ స్టే పిటిషన్‌ విచారణలో ఉండగానే ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేసినట్లు పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై తనకూ.. కొన్ని గంటల ముందే సమాచారం ఇచ్చారని తెలిపారు. కాగా, కోర్టు కోరిన విధంగా రాష్ట్రం ఉన్న అప్పులు, సంక్షేమ పథకాల కోసం చేసిన రుణాలు, భూనిర్వాసితులకు నష్ట పరిహార వివరాలపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై.. ధర్మాసనం అదనపు అడ్వకేట్‌ జనరల్‌(ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రశ్నించింది. దీనికి మరింత సమయం కావాలంటూ ఏఏజీ సమాధానం ఇవ్వడంతో స్పందించిన ధర్మాసనం. విచారణ రెండువారాల పాటు వాయిదా వేసింది. కాగా, అదే సమయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న దివ్యాంగ వధువులకు ఊరటనిస్తూ జీవో నం. 4పై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈ పథకాల కింద వీరికి అందుతున్న అదనపు సాయంపై పిటిషనర్‌ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో దివ్యాంగులకు ఉపశమనం లభించనుంది.

Updated Date - Aug 25 , 2026 | 05:52 AM