కాళేశ్వరంలో వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు..
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:01 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 29: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి అంత్య పుష్కరాలకు సంబంధించిన అధికారిక పోస్టర్, టీజర్ను బుధవారం ఆవిష్కరించారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. సరస్వతీ అంత్య పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నామన్నారు.
మే 21వ తేదీ ఉదయం 5:43 గంటలకు తొలి పుష్కర స్నానంతో వేడుకలు ప్రారంభమవుతాయి. కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానాన్ని ఆచరిస్తారు. త్రివేణి సంగమం వద్ద ప్రతిరోజూ గంగా హారతి నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు కాశీ పండితులచే అత్యంత వైభవంగా మహా హారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..‘సరస్వతీ అంత్య పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 30.63 కోట్లు వెచ్చించి, మొత్తం 162 రకాల అభివృద్ధి పనులను చేపట్టింది. ఈ 12 రోజుల్లో సుమారు 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. వాహనాల రద్దీ వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం’ అని అన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘సరస్వతి అంత్య పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించాం. ఈ పుష్కర వేడుకలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్కు ఇప్పటికే ఆహ్వానం పంపారు. కాళేశ్వరం ఆలయ సమగ్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 198 కోట్లు కేటాయించారు. గవర్నర్కు పుష్కరాలకు ఆహ్వానం పంపించాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్ పేరుపైనే కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదం: కోమటిరెడ్డి
రేవంత్ రెడ్డికి నాకు వ్యక్తిగత పంచాయతీ లేదు: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News