Share News

ఏదులపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:48 AM

ఖమ్మం జిల్లా ఏదులపురం మున్సిపాలిటీ అభివృద్ధిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి సారించారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఏదులపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy

ఖమ్మం, ఆగస్టు 7: జిల్లాలోని ఏదులపురం మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏదులపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ నిధులతో మున్సిపాలిటీలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాల మెరుగుదల వంటి పనులను చేపడతామని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో ఎలాంటి లోటు లేకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.


మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీ ప్లాట్లలో వర్షపు నీరు నిలిచి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని మంత్రి పరిశీలించారు. నిలిచిన నీటిని తొలగించి దోమల వ్యాప్తి, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మున్సిపాలిటీలోని పార్కుల అభివృద్ధి పనులను కూడా ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలకు ఆట స్థలాలు, వృద్ధులకు సేదతీరే ప్రదేశాలు అందుబాటులో ఉండేలా పార్కులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఏదులపురం మున్సిపాలిటీకి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకుని ఏదులపురంను రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

బోఫోర్స్ కేసు.. చివరి పిటిషన్‌నూ కొట్టేసిన సుప్రీం కోర్టు

ట్రంప్ కొత్త ఆదేశాలు.. జన్మతః పౌరసత్వ నిబంధనలు మరింత కఠినతరం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 12:15 PM