ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టిన గంజాయి స్మగ్లర్లు..
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:06 AM
నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా.. ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై దాడి చేసింది. కారును ఆపి తనిఖీ చేయాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సహా ఇతర సిబ్బంది ప్రయత్నించగా, స్మగ్లర్లు కారును వేగంగా నడిపి పోలీస్ సిబ్బందిని ఢీకొట్టారు.
నిజామాబాద్, జనవరి 14: జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా.. ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై దాడి చేసింది. మాధవనగర్ ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తున్న కారును ఆపి తనిఖీ చేయాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సహా ఇతర సిబ్బంది ప్రయత్నించగా.. స్మగ్లర్లు కారును వేగంగా నడిపి పోలీస్ సిబ్బందిని ఢీకొట్టారు.
ఈ దాడిలో మహిళా కానిస్టేబుల్ సౌమ్యకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటన జరిగిన వెంటనే పోలీసులు వాహనాన్ని వెంబడించి, కారును ఆపి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు నిర్మల్ జిల్లాకు చెందిన వారని గుర్తించారు పోలీసులు. గంజాయి గ్యాంగ్ పారిపోతున్న కారు స్తంభానికి ఢీకొనడంతో వారు చివరికి పోలీసులకు చిక్కారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఏజెంటిక్ ఏఐలో కొలువులే కొలువులు
మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. ఒత్తిడిలో అదానీ గ్రూప్ షేర్లు..