సంగారెడ్డి జిల్లా బీబీపేటలో చిరుత కలకలం.. లేగదూడపై దాడి..
ABN , Publish Date - May 11 , 2026 | 10:40 AM
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట గ్రామ శివార్లలో చిరుత పులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి, మే 11: జిల్లాలోని కల్హేర్ మండలం బీబీపేట గ్రామ శివార్లలో చిరుత పులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుత కదలికలు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఓ రైతు పొలంలో లేగ దూడపై దాడి చేయడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. బీబీపేట గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ పొలం వద్ద పశువులను కట్టేయగా.. అర్ధరాత్రి సమయంలో చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో ఒక లేగదూడ మృతి చెందింది. ఉదయం పొలానికి వెళ్లిన రైతు.. లేగ దూడ చనిపోయి ఉండడాన్ని చూసి షాక్కు గురయ్యారు.
చిరుత అడుగుజాడలను గమనించిన ఆయన వెంటనే గ్రామస్థులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత సంచారం ఉన్న మాట వాస్తవమేనని ద్రవీకరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. కల్హేర్ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఊరికి సమీపంలోని పొలాల్లోకి వచ్చి పశువులను చంపుతుండటంతో, రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాలంటేనే రైతులు వణికిపోతున్నారు.
ఇవి కూడా చదవండి...
సెల్ఫోన్ చిచ్చు.. పెళ్లయిన నెల రోజులకే దంపతుల ఆత్మహత్య
Read Latest Telangana News And Telugu News