Share News

పరిహారం ఇస్తేనే పనులు

ABN , Publish Date - May 15 , 2026 | 11:43 PM

బై పాస్‌ రోడ్డు పనులను శుక్రవారం రైతులను అడ్డగించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అప్పన్నపేటలో 15 ఏళ్ల క్రితం పైప్‌లైన్‌ కింద భూములు కోల్పోయిన ఇప్పటివరకు బకాయిలు రాలేదన్నారు. ఇప్పుడు బైపాస్‌ రహదారి కోసం భూములు తీసుకుంటే ఎక్కడి నుంచి నష్టపరిహారం ఇస్తారంటూ అప్పన్నపేట రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిహారం ఇస్తేనే పనులు

పెద్దపల్లి రూరల్‌, మే 15 (ఆంఽధ్రజ్యోతి) : బై పాస్‌ రోడ్డు పనులను శుక్రవారం రైతులను అడ్డగించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అప్పన్నపేటలో 15 ఏళ్ల క్రితం పైప్‌లైన్‌ కింద భూములు కోల్పోయిన ఇప్పటివరకు బకాయిలు రాలేదన్నారు. ఇప్పుడు బైపాస్‌ రహదారి కోసం భూములు తీసుకుంటే ఎక్కడి నుంచి నష్టపరిహారం ఇస్తారంటూ అప్పన్నపేట రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైపాస్‌ రహదారి నిర్మాణ పనుల వద్ద అప్పన్నపేట రైతుల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ భూములను తీసుకుంటున్నప్పటికీ సరైన నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేపడుతున్నారని రైతులు ఆరోపించారు. తమకు ఉన్న ఎకరం, రెండు ఎకరాల చిన్నచిన్న భూములే కుటుంబాలకు ఆధారమని, అవి పోతే జీవనం కష్టమవుతుందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని అధికారులు ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. పాత పైప్‌లైన్‌ పరిహారం చెల్లించి, అనంతరం బైపాస్‌ భూములపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సంఘటన స్థలానికి పెద్దపల్లి రూరల్‌ ఎస్‌ఐ మల్లేష్‌ చేరుకొని రైతులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొనడంతో రైతులు ఆందోళన విరమించారు. ఆర్‌ఐ శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

భూసర్వేను అడ్డుకున్న రైతులు

ముత్తారం, (ఆంధ్రజ్యోతి): దరియాపూర్‌ గ్రామపంచాయతీ శివారులో గల 144, 145 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు శుక్రవారం భూ సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని సర్వేను అడ్డుకున్నారు. రైతులు మాట్లాడుతూ తాము 40 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, 144, 145సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇన్నేళ్లుగా కాస్తులో ఉన్న తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిపై సమగ్ర సర్వే జరిపి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ అధికారి రైతులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సర్వే నిర్వహిస్తున్నామని, రైతులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్‌ను సంప్రదించాలన్నారు. తహసీల్దార్‌ మధుసూదన్‌ రెడ్డి వివరణ ఇస్తు ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించేందుకే ప్రాథమికంగా సర్వే చేపట్టామని తెలిపారు. ఎవరి పట్టా భూములను లాక్కోమని, సర్వేకు అందరూ సహకరించాలని కోరారు.

Updated Date - May 15 , 2026 | 11:43 PM