గడీలపాలనను బద్దలు కొట్టి ప్రజాపాలన అందిస్తున్నాం
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:00 AM
గత ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, గడీల పాలనను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అందిస్తోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. ప్రజాపాలనను ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు.
పాలకుర్తి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, గడీల పాలనను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అందిస్తోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. ప్రజాపాలనను ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో వారికి గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం తహసీల్దార్ జేరిపోతుల సునీతతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తోందన్నారు. సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కార్యాలయం అందుబాటులోకి రావడంతో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత సులభతరం కానున్నాయన్నారు. అదనపు కలెక్టర్ శ్రీరాములు, ఆర్డీవో గంగయ్య, ఏసీపీ మడత రమేష్, సీఐ వై కృష్ణకుమార్, ఎస్ఐ నూతి శ్రీధర్, సర్పంచ్ పెద్దపల్లి తిరుమల, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.