Share News

ఓటర్లే నిర్ణేతలు..

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:58 AM

పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి.. మున్సిపల్‌ ఎన్నికలు తెరపైకి వచ్చాయి. తర్వాత పరిషత్‌ ఎన్నికలు రాబోతున్నాయి... బరిలో నిలిచే అభ్యర్థులు మాత్రం ఓటర్ల మనసు దోచుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ రాకపోయినా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఇంటింటికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహులు పరుగులు తీస్తూనే ఉన్నారు.

ఓటర్లే నిర్ణేతలు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి.. మున్సిపల్‌ ఎన్నికలు తెరపైకి వచ్చాయి. తర్వాత పరిషత్‌ ఎన్నికలు రాబోతున్నాయి... బరిలో నిలిచే అభ్యర్థులు మాత్రం ఓటర్ల మనసు దోచుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ రాకపోయినా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఇంటింటికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహులు పరుగులు తీస్తూనే ఉన్నారు. ఇదే ఓటరుకు ఉండే ప్రత్యేకత... ఎన్నికలు వచ్చాయంటే ఓటరు దేవోభవ.. అంటూ రాజకీయ నేతలు పరుగులు తీస్తారు. సామాన్యుడి నిర్ణయాలతో రాజకీయాలు, దేశ భవిష్యత్‌లోను మార్పులు వస్తాయి. ఓటుకు రాజకీయ నేతల భవిష్యత్తు చూపుడు వేలుకు పెట్టే సిరా చుక్కతో తారుమారవుతుంది. ఓటర్లే నిర్ణేతలుగా ఉంటారు. మనిషికి ఒక వజ్రాయుధంగా రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించిన హక్కు ఓటుహక్కు. ఓటు హక్కు పొందడానికి ఎన్నికల కమిషన్‌ విసృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ అర్హులుగా కమిషన్‌ ఆధునిక సాంకేతిక మార్గాల ద్వారా కూడా ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ప్రచారం నిర్వహిస్తోంది. ఓటరు గుర్తింపునకు ఆధార్‌ లింకేజీని కూడా చేశారు. కలర్‌ గుర్తింపు కార్డులు కూడా కమిషన్‌ అందిస్తోంది. ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నా భారత దేశం - నా ఓటు (మై ఇండియా .. మై ఓట్‌) అనే థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఫ జిల్లాలో 483735 మంది ఓటర్లు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 483735 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 232835 మంది, మహిళలు 250857 మంది ఉన్నారు. ఇందులో సర్వీస్‌ ఓటర్లు 168 మంది, ఎన్‌ఆర్‌ఐలు 39 మంది ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 231703 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 110540 మంది, మహిళలు 121127 మంది ఉన్నారు. ఇతరులు 36 మంది, సర్వీస్‌ ఓటర్లు 63 మంది, ఎన్‌ఆర్‌ఐలు 20 మంది ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 252032 మంది ఓటర్లు ఉండగా పురుషులు 122295 మంది, మహిళలు 129730 మంది, ఇతరులు 7 మంది, సర్వీస్‌ ఓటర్లు 105 మంది, ఎన్‌ఆర్‌ఐలు 19మంది ఉన్నారు.

మహిళలే అధికం..

జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో 483735 మంది ఓటర్లలో 18022 మంది మహిళలు అధికంగా ఉన్నారు. వేములవాడ సెగ్మెంట్‌లో 10587మంది, సిరిసిల్ల సెగ్మెంట్‌లో 7435 మంది మహిళలు అధికంగా ఉన్నారు.

నేపథ్యం ఇదీ...

భారత రాజ్యాంగం 15వ భాగంలో 324వ అధికరణం ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను ప్రస్తావించింది. భారత ఎన్నికల సంఘం జనవరి 25, 1950లో ఏర్పడింది. అందుకే 2011 నుంచి జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు పార్లమెంట్‌ ఉభయ సభలకు రాష్ట్ర శాసనసభలకు, విధాన పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించడం ప్రధాన విధులు. ఈ సంఘం ఉపఎన్నికలు, మధ్యంతర ఎన్నికులు కూడా నిర్వహిస్తుంది. సంఘానికి ప్రస్తుతం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇద్దరు ఎలక్షన్‌ కమిషనర్లు ఉన్నారు. ఈ కమిషనర్లను కేంద్ర మంత్రి మండలి సూచనలు అనుసరించి రాష్ట్రపతి నియమిస్తారు.

రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు ఒక్కటే గుర్తింపుకార్డు...

దేశంలో రాష్ట్రపతి నుంచి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడి వరకు, అత్యున్నత అధికారి నుంచి అటెండర్‌ వరకు, ధనిక, పేద తేడా లేకుండా అందరికి ఒకే విధమైన గుర్తింపు కార్డు ఓటరు కార్డు మాత్రమే. భారత ఎన్నికల సంఘం జారీ చేసే గుర్తింపు కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి..

- మాణిక్యరావు సంగీత, రిసెర్చ్‌ స్కాలర్‌, సిరిసిల్ల

ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యంలో మార్పులు సాధ్యమవుతాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. ఓటరు నమోదు కోసం ఎన్నికల కమిషన్‌ ఎన్నో విధాలుగా అవకాశాలు కల్పిస్తుంది. అన్‌లైన్‌ ద్వారా ఓటరుగా నమోదు కావచ్చు.

ఓటు వేయడం మన బాధ్యత..

- డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌, బాలసాహితీవేత్త

ఓటు వేయడం మన బాధ్యతగా గుర్తించాలి. ఓటుకు ఎంతో విలువ ఉంది. మన భవిష్యత్త్‌ను తీర్చిదిద్దే ప్రజాప్రతినిధులను ఎన్నుకునే వీలు ఉంటుంది. ఓటు హక్కును ముఖ్యంగా యువత వినియోగించుకోవాలి. దేశ భవిష్యత్త్‌ కోసం ఓటు వేయాలి. సామాజిక బాధ్యతగా ఓటు హక్కు పొందడం, ఓటు వేయడాన్ని గుర్తించాలి. ఓటు హక్కు నమోదు కోసం విద్యావంతులు ప్రజల్లో అవగాహన పెంచడానికి కృషి చేయాలి. ఓటు హక్కు వేయడం కోసం నిర్భందపు చట్టం తేవాలి.

మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు..

- యెల్లంకి శ్రీనివాస్‌, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా నచ్చిన మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు భారత రాజ్యంగంలో 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు ఓటు హక్కును కల్పించింది. ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే ఆయుధం. ప్రజల తలరాతలను మార్చే వజ్రాయుధం. సమాజంలో మార్పు రావాలంటే ఆవినీతిరహిత పాలన అందించే వారినే పాలకులుగా ఎన్నుకోవాలి. దీంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.

ఓటు విలువ తెలుసుకోవాలి..

- డాక్టర్‌ చింతోజు భాస్కర్‌, లోక్‌ అదాలత్‌ సభ్యుడు సిరిసిల్ల

ఓటు విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓటుహక్కును అందరు వినియోగించుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. విద్యావంతులు, యువకులు ఓటింగ్‌ ప్రక్రియకు దూరంగా ఉండటం దురదృష్టకరం. ఓటును అమ్ముకోకుండా, సమర్థవంతులైన వ్యక్తులకు వేయడం ద్వారానే ఉత్తమ సమాజం నిర్మితం అవుతుంది. అర్హులందరు ఓటుహక్కును నమోదు చేసుకోవాలి.

ఓటుహక్కు పొందడం సామాజిక బాధ్యత..

- బుస్స పవన్‌ వ్యాపారి

ఓటుహక్కు పొందడం సామాజిక బాధ్యతగా భావించాలి. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఓటు ద్వారానే సమానత్వం వస్తుంది. సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేయకపోతే అసమర్థులు రాజ్యపాలన చేస్తారు. ఓటుహక్కును వినియోగించుకొని వారిపై చర్యలు తీసుకుంటేనే ఓటింగ్‌ శాతం పెరుగుతుంది. పట్ణణాలలో ఓటింగ్‌ శాతం పెంచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.

Updated Date - Jan 25 , 2026 | 12:58 AM