ఎస్సీ పోలీసుల పదోన్నతుల్లో జాప్యం వద్దు
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:16 AM
ఎస్సీ ఫిర్యాదులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఎస్సీ పోలీసుల పదోన్నతుల్లో జాప్యంవద్దని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
జ్యోతినగర్, జనవరి27(ఆంధ్రజ్యోతి): ఎస్సీ ఫిర్యాదులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఎస్సీ పోలీసుల పదోన్నతుల్లో జాప్యంవద్దని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గాలకు చెందిన బాధితులు ఇస్తున్న ఫిర్యాదుల విషయంలో జాప్యం జరుగుతున్నదని, పోలీసుల నిర్లక్ష్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఎస్సీ పోలీసుల పదోన్నతులకు సంబంధించి శాఖ పరిధిలో తీసుకుంటున్న చర్యలపై కమిషన్ సభ్యుడు రాంచందర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రమోషన్ల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదన్నారు. రోస్టర్ ప్రకారం ఎస్సీ పోలీస్ సిబ్బంది పదోన్నతులు కల్పించాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పోలీస్ శాఖలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు.. ఇతర వివరాలను కమిషన్కు పంపించాలని గతంలో ఆదేశించినా, ఉన్నతాధికారులు స్పందించలేదని ఆయన ఆసంతృప్తి చెందారు. గతేడాది డిసెంబర్లో కర్ల రాజేష్ అనే దళిత యువకుడి లాకప్ డెత్ విషయంలో బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు జరిగిందని, ఇందులో నిందితులుగా ఉన్న కోదాడ రూరల్ సీఐ, ఎస్ఐలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్, రామగుండం సీపీ అంబర్ కిషోర్, సీఐడీ డీఎస్పీ అన్యోన్య, సతీష్, ఎస్సీ లీగల్ చోడగిరి, ఎస్పీ శ్రీనివాసరావు, అడిషనల్ ఐజీ రమణ కుమార్, సూపరిండెంట్ మధుబాబు పాల్గొన్నారు.