నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ABN , Publish Date - May 17 , 2026 | 11:45 PM
నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కులవృత్తినే నమ్ముకున్న ఏ కుటుంబం కూడా ఎన్నడూ దివాలా తీయలేదని ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు కొనియాడారు. ఆర్ఆర్ గార్డెన్లో ఆదివారం పద్మశాలి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళ లో వెల్లడించారు
పెద్దపల్లి టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి): నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కులవృత్తినే నమ్ముకున్న ఏ కుటుంబం కూడా ఎన్నడూ దివాలా తీయలేదని ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో ఆదివారం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, నేతన్నలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పద్మశాలీల కులవృత్తిని బతికించుకోవాలనే సంకల్పంతో ఇప్పటికే ప్రభుత్వం ద్వారా సుమారు రూ.30 కోట్ల వ్యక్తిగత రుణాలను మాఫీ చేసినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర హైండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దూడం వెంకటరమణ, పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పద్మశాలీల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సుల్తానాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో పద్మశాలి కమ్యూనిటీ భవనాలను నిర్మించామని గుర్తుచేశారు. నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు, పెండింగ్లో ఉన్న కాంపౌండ్ వాల్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ప్రభుత్వ స్థలాలు లేకపోవడం వల్లే కోర్టు భవనం, మోడల్ స్కూల్, కస్తూర్బా విద్యాలయం, మహిళా సమాఖ్య భవనాలను రాఘవాపూర్, పెద్దాపూర్ వంటి శివారు ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందన్నారు. పెద్దపల్లి పట్టణంలో పద్మశాలి భవన నిర్మాణానికి స్థలం కేటాయించే విషయమై సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ వేముల రామమూర్తితో సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా పరిశీలించి ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. పద్మశాలి రాష్ట్ర అధ్యక్షుడు వల్లకట్ల రాజ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అయిల రమేష్, ఉపాధ్యక్షుడు సాయిరి మహేందర్, ఓదెల దేవస్థానం చైర్మన్ చీకట్ల మొండయ్య, జూలపల్లి మాజీ జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్, మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగు యాదగిరి, నాయకులు కొలిపాక సత్తయ్య, స్వతంత్ర కుమార్ పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.