భూగర్భ జలాల రక్షణకు చర్యలు చేపట్టండి
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:30 PM
వర్షం నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను వృథా చేయకుండా తక్షణమే రక్షణ చర్యలను చేపట్టాలని జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో కె.నరేందర్ అన్నారు. మండల పరిషత్ కార్యాల యంలో శుక్రవారం జలశ్రీ పథకం అమలులో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఓదెల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): వర్షం నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను వృథా చేయకుండా తక్షణమే రక్షణ చర్యలను చేపట్టాలని జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో కె.నరేందర్ అన్నారు. మండల పరిషత్ కార్యాల యంలో శుక్రవారం జలశ్రీ పథకం అమలులో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉన్నందున అన్ని శాఖల విభాగాలు ఆదివారం నుంచి ఆగస్టు 15 వరకు చర్యలు చేపట్టాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యి అడుగుల లోతులో భూగర్భ జలాలున్నాయని, ఇప్పటినుంచే బోర్ బావుల్లో నీరు ఇంకిపోతుందని తెలిపారు. తీవ్ర నీటి కొరతను అధిగమించడానికి వర్షం నీటిని ఒడిసిపట్టే పనులను చేపట్టాల న్నారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, మినీ కుంటలు (ఊరకుంట) బోర్వెల్ రీఛార్జ్ సెక్టార్లను నిర్మించాలని తెలిపారు. ఈ ప్రక్రియలతో నీరు వృథా కాకుండా భూమిలో ఇంకిపోతాయని, దీంతో భూగర్భజలాలు వృద్ధి చెంది నీటి కొరతను అధిగమించే అవకాశాలు ఉన్నాయన్నారు. దోమల నివారణకు మురికి నీటి నిల్వల వద్ద మందును స్ర్పే చేయాలని తెలిపారు. ఎంపీడీవో అనిల్రెడ్డి మాట్లాడుతూ డ్రైనేజ్ సోప్పిట్స్ నిర్మిం చాలని, గ్రామపంచాయతీ సమగ్రాభివృద్ధి ప్రణాళికలను తయారు చేసుకోవాలన్నారు. కస్తూర్బాగాంధీ వసతి గృహంలో జెడ్పి సీఈవో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు. జలశ్రీ పథకం ప్రక్రియల వాల్ పోస్టర్లను అధికారులు ఆవిష్కరించి జల సంరక్షణ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఏవో భాస్కర్, ఏఈ లతోపాటు కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.