ఆర్టీసీ డిపో కార్మికుల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:11 AM
గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ డిపో కార్యదర్శి వంగర శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఇన్చార్జి డీజీఎం రామన్నకు వినతిపత్రం అందజేశారు.
కళ్యాణ్నగర్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ డిపో కార్యదర్శి వంగర శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఇన్చార్జి డీజీఎం రామన్నకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ హెచ్ఎన్కే సర్వీస్ను ప్రయాణికులతో కూడిన రూట్ సర్వేచేసి కిలోమీటర్లు ఎక్కువ ఉన్నందున సర్వీస్లో తగ్గించి సరి చేయాలన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడు రోజుల సిక్ను అనుమతించే విధానాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు. ఎన్జెడ్బీ-2 సర్వీస్ను మంచిర్యాలకు పెంచుతూ స్పెషల్ ఆఫ్ డ్యూటీగా మార్చాలని, రన్నింగ్ సమయం సరిపోవడం లేదని, కండక్టర్, డ్రైవర్కు 14గంటల డ్యూటీ అవుతుందన్నారు. టిమ్ డ్రైవర్లకు ఖాళీగా ఉన్న డ్యూటీ అన్నీ కీస్లను పూరించాలని, రిజర్వేషన్ చార్ట్లో టిమ్ డ్రైవర్ల ఫోన్ నెంబర్ తొలగించి బస్టాండ్ కంట్రోలర్, రిజర్వేషన్ కౌంటర్ నెంబర్ పొందుపర్చాలన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కండక్టర్, డ్రైవర్, మెకానిక్, శ్రామిక్ కోరిన చోట లైట్ డ్యూటీ ఇప్పించాలని, మెట్రో సర్వీసుల్లో కండక్టర్ సీటు లేనందున కండక్టర్లు అనారోగ్యం పాలవుతున్నారని, జేఎంకే-1, ఓడిఎల్-1, కేఎస్ఎల్-1 డ్యూటీలను పాత 141ప్రకారం పెంచిన కిలో మీటర్ల తగ్గించి నడిపించాలన్నారు. మహిళా కండక్టర్లకు ఇన్కమింగ్ రాత్రి 11.30గంటలు అవుతున్నందున ఇబ్బందులు పడుతున్నారని, రానున్న వర్షాకాలం దృష్ట్యా గ్యారేజ్ పిట్లలో వాటర్ వస్తున్నాయని, వాటిని మరమ్మతు చేయాలని కోరారు. ఎస్ఎన్ చారి, వెంకటేష్, శ్రీనివాస్, కొమురయ్య, సుమన్, శ్రీను, ఆంజనేయులు పాల్గొన్నారు.