యూరియా యాప్తో సత్ఫలితాలు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:29 AM
యూరియా అధిక వాడకం తగ్గించడం, పం పిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొ చ్చిన యూరియా యాప్ సత్ఫలితాలనిస్తోంది. గత యాసంగి సీజన్లో రాష్ట్రంలో తొలిసారిగా యాప్ను పెద్దపల్లి జిల్లాలో అమలు చేశారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
యూరియా అధిక వాడకం తగ్గించడం, పం పిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొ చ్చిన యూరియా యాప్ సత్ఫలితాలనిస్తోంది. గత యాసంగి సీజన్లో రాష్ట్రంలో తొలిసారిగా యాప్ను పెద్దపల్లి జిల్లాలో అమలు చేశారు. యాప్ విజయవంతం కావడంతో 20 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్త రించారు. యాప్ అమలుతో యూరియా విక్ర యాలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ సాధ్యమైంది. రైతుల ఆధార్, భూమి వివరాలు నమోదు చేసి అవసరమైన మేరకే యూరియా అందించే విధా నాన్ని అమలు చేయడంతో జిల్లాలో యూరియా వినియోగం తగ్గింది. 2024-25 యాసంగిలో జిల్లాలో 2,28,727 ఎకరాల్లో వివిధ రకాల పం టలు సాగు చేయగా 38,226 మెట్రిక్ టన్నులు వినియోగించారు. 2025-26 యాసంగి సీజన్లో 2,42,620 ఎకరాల్లో పంటలు సాగు చేయగా 31,500 టన్నుల యూరియాను వినియోగిం చారు. ఇదే సీజన్ నుంచి జిల్లాలో యూరియా యాప్ తీసుకువచ్చారు. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో సాగు విస్తీర్ణం పెరిగినా కూడా 6,726 టన్నుల యూరియా వినియోగం తగ్గిన ట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతు న్నారు. దీంతో అనవసర వినియోగం, అక్రమ మళ్లింపులు తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు.
యూరియా ఉత్పత్తి తగ్గడం వల్లనే యాప్ రూపకల్పన
గడిచిన యాసంగి సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పెరగడం, అందుకు తగ్గట్లుగా యూరి యా సరఫరా అందలేదు. ఆర్ఎఫ్సీఎల్లో సాంకేతిక కారణాల వల్ల కావలసిన యూరియా ఉత్పత్తి కంటే తక్కువ యూరియా ఉత్పత్తి అవుతుండడం, అవసరానికి మించి రైతులు యూరియా వాడుతున్నారని గుర్తించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష యూరియా యాప్ను తీసుకు వచ్చారు. ఎకరం వరి పంటకు 3 బస్తాలు, మొక్కజొన్న, పత్తి పంటలకు 4 బస్తాలు, ఇతర పంటలకు ఎకరానికి 2 బస్తాలు ఇచ్చే విధంగా యాప్ను రూపొందించారు. వరి, పత్తి, మొక్క జొన్న పంటలకు విడతల వారీగా ఎకరానికి ఒక్కో బస్తా చొప్పున అందజేసే విధంగా యాప్ను రూపొందించారు. మొదట 20 రోజుల పాటు అమలు చేయగా, సత్ఫలితాలు రావడం తో రాష్ట్ర ప్రభుత్వం యాప్ గురించి సంబంధిత జిల్లా అధికారుల ద్వారా తెలుసుకుని యాప్లో ఉన్న లోపాలను సరిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు.
దేశవ్యాప్త అమలుకు సన్నాహాలు..
జిల్లాలో విజయవంతమైన యూరియా యాప్ అమలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం వల్ల సత్ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని నమూనాగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం యూరియా యాప్ను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఒక్కో 45 కిలోల యూరియా బస్తాను 267 రూపాయలకు విక్రయిస్తుండగా, కేంద్రం 1900 రూపాయల సబ్సిడీ భరిస్తున్నది. ఈ యాప్ వల్ల యూరియా వినియోగం తగ్గడంతో ప్రభు త్వంపై సబ్సిడీ భారం తగ్గుతుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో ప్రతీ రాష్ట్రంలో రెండు జిల్లాలను ఎంపిక చేసి ప్రయోగా త్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను ఎంపిక చేసింది.
సహకార సంఘాల ద్వారానే అధిక విక్రయాలు..
యాప్ అమలు మరింత సమర్థవంతంగా ఉండేందుకు సహకార సంఘాల ద్వారా కనీసం 80 శాతం యూరియా విక్రయాలు జరపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు మార్క్ఫెడ్కు 60 శాతం, ప్రైవేట్ డీలర్లకు 40 శాతం యూరియా కేటాయింపులు చేస్తున్నారు. మార్క్ఫెడ్ సహకార సంఘాల ద్వారా ఎంఆర్పీ ధరలకే విక్రయిస్తున్నారు. అదే ప్రైవేట్ డీలర్లు రిటెయిల్ ఎరువుల దుకాణాల ద్వారా యూరియాను విక్రయిస్తున్నారు. సదరు వ్యాపా రులు డిస్ట్రిబ్యూటర్ల వద్ద అదనంగా 20, రవాణా, హమాలీల చార్జీ 20 రూపాయలు కలుపుకుని ఒక్కో బస్తాను 310 రూపాయల వరకు విక్ర యిస్తున్నారు. దీంతో రైతులు సహకార సంఘాల్లో విక్రయించే యూరియానే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ప్రైవేట్ రిటెయిల్ ఎరువుల దుకాణాల వ్యాపారులు సైతం యూరి యాను విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రభుత్వం మార్క్ఫెడ్కు యూరి యాను 80 శాతం, ప్రైవేట్ డీలర్లకు 20 శాతం మాత్రమే యూరియా కేటాయించాలని భావిస్తు న్నది. ప్రస్తుతం యాప్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, నెట్వర్క్ ఇబ్బందులు, రైతుల వివరాల నమోదులో తలెత్తుతున్న లోపాలపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమస్యలను అధిగమించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. యూరియా అవసరమైన రైతులకే సకాలంలో అందించడం, ఎరువుల కొరతను నివారించడం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేయడం యాప్ ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.