Share News

పెట్రోల్‌, డీజిల్‌ కోసం బారులు

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:06 AM

జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంక్‌ల్లో పెట్రోల్‌, డీజిల్‌కు కొరత ఏర్పడడంతో పలు బంక్‌లు సోమవారం మూతబడ్డాయి. దీంతో వాహనదారులు తీసి ఉన్న బంక్‌ల వద్ద బారులు తీరారు.

పెట్రోల్‌, డీజిల్‌ కోసం బారులు

పెద్దపల్లి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంక్‌ల్లో పెట్రోల్‌, డీజిల్‌కు కొరత ఏర్పడడంతో పలు బంక్‌లు సోమవారం మూతబడ్డాయి. దీంతో వాహనదారులు తీసి ఉన్న బంక్‌ల వద్ద బారులు తీరారు. పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లిలో నాలుగు పెట్రోల్‌ బంక్‌లు ఉండగా, మూడు బంక్‌ల్లో నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. ఒక పెట్రోల్‌, డీజిల్‌ దొరకదని భావించిన లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు బారులు తీరారు. కొందరైతే ఇక డీజిల్‌ దొరకదనుకుని క్యాన్లు కూడా వెంట తీసుకుని వచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా లేని కారణంగానే బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. అధికారులు మాత్రం జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని చెబుతున్నారు.

కళ్యాణ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో వినియోగదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కొన్ని బంకుల్లో సోమవారం ఉదయం నుంచి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ కొరత ఉండడంతో వినియోగదారులు ఉన్న బంకుల వద్ద పెట్రోల్‌ కోసం బారులు తీరుతున్నారు. మోటార్‌ సైకిల్‌కు రూ.200, కార్లకు రూ.1500, లారీలకు రూ.5000, హెవీ వెహికిల్స్‌కు రూ.10వేల డీజిల్‌ మాత్రమే పోస్తామంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో వినియోగదారులు వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ పోయించడానికి బారులు తీరుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 40బంకులు ఉండగా సగం వరకు నో స్టాక్‌ బోర్డులు ఉండడం, హైవేల వెంట పెట్రోల్‌, డీజిల్‌ లేదంటూ బోర్డులు పెట్టడడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తమ వాహనాల్లో ఇంధనం నింపుకోవడానికి బారులు తీరుతున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:06 AM